లంచం ఇవ్వకుంటే రౌడీషీటే... | Textile merchant threat to SI | Sakshi
Sakshi News home page

లంచం ఇవ్వకుంటే రౌడీషీటే...

Dec 26 2014 1:11 AM | Updated on Mar 19 2019 5:52 PM

లంచం ఇవ్వకుంటే రౌడీషీటే... - Sakshi

లంచం ఇవ్వకుంటే రౌడీషీటే...

లంచం ఇవ్వకుంటే రౌడీషీట్ తెరుస్తామని బెదిరించిన ఎస్‌ఐ, కానిస్టేబుల్ ఏసీబీ అధికారులకు చిక్కడం పోలీసు శాఖలో కలకలం రేపింది.

* వస్త్ర వ్యాపారికి ఎస్‌ఐ బెదిరింపు
* రూ.లక్ష తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన వైనం

ఎంవీపీ కాలనీ : లంచం ఇవ్వకుంటే రౌడీషీట్ తెరుస్తామని బెదిరించిన ఎస్‌ఐ, కానిస్టేబుల్ ఏసీబీ అధికారులకు చిక్కడం పోలీసు శాఖలో కలకలం రేపింది. వస్త్ర వ్యాపారి నుంచి గురువారం రూ.లక్ష లంచం తీసుకుంటుండగా మూడో పట్టణ పోలీస్‌స్టేషన్ వాల్తేరు జోన్ ఎస్‌ఐ రామారావు, కానిస్టేబుల్ లక్ష్మణరావును ఏసీబీ అధికారులు పట్టుకున్నారు.
 
ఏం జరిగిందంటే..
వస్త్ర వ్యాపారులు రాజ్‌కుమార్ మోది, దినేస్ మోది ప్లాట్ కొనుగోలు నిమిత్తం పాండ్యన్ అనే వ్యక్తికి రూ.15 లక్షలు అడ్వాన్‌‌సగా ఇచ్చారు. రోజులు గడుస్తున్నా అతను ప్లాట్ రిజిస్ట్రేషన్ చేయడం లేదు. అడ్వాన్‌‌స తిరిగి ఇచ్చేయాలని వారు అడగడంతో పాండ్యన్ పరారయ్యాడు. ఈ నేపథ్యంలో ఈనెల 22న అతను ఇంటికి వచ్చినట్టు తెలుసుకున్న రాజ్‌కుమార్ మోది ఎనిమిది మంది అనుచరులతో అతని వద్దకు వెళ్లి కొట్టి వదిలేశాడు. వారిపై ఈ నెల 23న పాండ్యన్ త్రీటౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు ఎనిమిది మందిని అరెస్టు చేశారు. రాజ్‌కుమార్ మోది మాత్రం ముందస్తు బెయిల్ పొందాడు.

ఈ కేసు దర్యాప్తు చేస్తున్న వాల్తేరు జోన్ ఎస్‌ఐ రామారావు అతనికి ఫోన్ చేసి రూ.1.5 లక్షల లంచం ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేకుంటే రౌడీషీట్ తెరుస్తామని బెదిరించారు. దీంతో రాజ్‌కుమార్ మోది ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. లంచం ఇచ్చేందుకు గురువారం రాజ్‌కుమార్ మోది వాల్తేరు జోన్ పోలీసుస్టేషన్‌లో ఎస్‌ఐను కలిశాడు. పక్క గదిలోని కానిస్టేబుల్ లక్ష్మణరావుకు ఇవ్వమని ఆయన చెప్పడంతో అక్కడి వెళ్లాడు. రూ. లక్ష లంచం తీసుకుంటుండగా కానిస్టేబుల్‌ను ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. అక్కడినుంచి పరారయ్యేందుకు ప్రయత్నించిన ఎస్‌ఐ రామారావును అరెస్టు చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement