భార్యాభర్తలపై టీడీపీ నేత దాష్టికం | TDP Leader Attack On Wife And Husband At Badvel | Sakshi
Sakshi News home page

భార్యాభర్తలపై టీడీపీ నేత దాడి

Feb 23 2019 8:29 AM | Updated on Feb 23 2019 1:59 PM

TDP Leader Attack On Wife And Husband At Badvel - Sakshi

బద్వేలు అర్బన్‌: పట్టణంలోని తెలుగుగంగకాలనీలో నివసిస్తున్న భార్యాభర్తలపై శుక్రవారం ఓ స్థలవివాదంలో అధికారపార్టీకి చెందిన నేతతో పాటు మరికొందరు దాడిచేసి గాయపరిచారు. బాధితుల ఫిర్యాదు మేరకు అర్బన్‌ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు తెలుగుగంగకాలనీలో నివసిస్తున్న తుమ్మలూరుసరస్వతి, వీరభాస్కర్‌రెడ్డిలు ఇంటిలో ఉండగా మధ్యాహ్నం సమయంలో వారి ఇంటి పక్కనే ఉన్న స్థలంలో ట్రాక్టర్‌తో రాళ్లు తోలుతుండగా సరస్వతి అడ్డుకుంది. ఈ స్థలంపై కోర్టులో కేసు నడుస్తోందని, ఇక్కడ రాళ్లు ఎలా తోలుతారని ప్రశ్నించి అక్కడి నుంచి ట్రాక్టర్లను పంపించింది.

విషయం తెలుసుకున్న అధికారపార్టీకి చెందిన గోడిరమణారెడ్డి తన అనుచరులైన బత్తల వెంకటేశ్వర్లు, మరికొందరితో కలిసి అక్కడికి చేరుకుని అసభ్య పదజాలంతో దుర్భాషలాడుతూ నేను చేపట్టే పనిని అడ్డుకునే ధైర్యం ఎవరికి ఉందంటూ సరస్వతిపై దాడిచేశారు. అడ్డుకోబోయిన ఆమె భర్త వీరభాస్కర్‌రెడ్డిపై కూడా దాడి చేసి అక్కడి నుంచి వెళ్లిపోయారు. అనంతరం భార్యాభర్తలు ఇరువురు పోలీసుస్టేషన్‌కు చేరుకుని గొడవకు సంబంధించిన సీసీ పుటేజీ దృశ్యాలను చూపించి రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు. దీనిపై పట్టణ పోలీసుస్టేషన్‌లో రమణారెడ్డి, మరికొందరిపై కేసు నమోదు చేశారు.    

Advertisement
 
Advertisement
Advertisement