రుయాలో ముదురుతున్న వివాదం

SV Medical College Doctors Strike Against Professors - Sakshi

సాక్షి, తిరుపతి : ఎస్వీ మెడికల్‌ కాలేజీ విద్యార్థి డాక్టర్‌ శిల్ప ఆత్మహత్య కేసు రోజురోజుకు ముదురుతోంది. శిల్ప మృతి ఘటనలో ప్రొఫెసర్లపై చర్యలను నిరసిస్తు రుయాలో సీనియర్‌ డాక్టర్లు ఆందోళన చేస్తున్నారు. రోజు గంటపాటు నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేయనున్నట్లు డాక్టర్లు ప్రకటించారు. దీనిపై సోమవారం  ప్రభుత్వం చర్చలు జరుపునున్నామని డాక్టర్లు తెలిపారు. మరోవైపు ప్రొఫెసర్లపై చర్యలు ఉపసంహరించుకుంటే పోరాటం మరింత ఉధృతం చేస్తామంటూ జూడాలు హెచ్చరిస్తున్నారు. కాగా ఎస్వీ మెడికల్‌ కాలేజీ విద్యార్థి శిల్ప ప్రొఫెసర్ల వేధింపుల కారణంగా ఇటీవల ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే.

ఈ వివాదం కారణంగా కాలేజీలో జూనియర్‌, సీనియర్‌ డాక్టర్ల్‌ మధ్య తీవ్ర విభేదాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఘటనలో కాలేజీ ప్రిన్సిపల్‌ రమణయ్యను సస్పెండ్‌ చేయడాన్ని సీనియర్‌ డాక్టర్లు తప్పుపడుతున్నారు. శిల్ప ఆత్మహత్య తరువాత జరిగిన పరిణామాలపై సీనియర్‌ డాక్టర్లు అత్యవసరంగా సమావేశమయ్యారు. ప్రిన్సిపల్‌ రమణయ్యను తిరిగి విధుల్లోకి చేర్చాలంటూ సీనియర్‌ డాక్టర్లు డిమాండ్‌ చేస్తుండగా.. అదే సమయంలో ప్రిన్సిపల్‌పై సస్పెన్షన్‌ను ఎత్తివేస్తే ఉద్యమం తప్పదంటూ జూనియర్‌ డాకర్లు హెచ్చరిస్తున్నారు. జూనియర్‌ డాక‍్టర్‌ శిల్ప ఆత్మహత్య చేసుకోవడానికి వైద‍్యులు కారణం కాదని, కుటుంబ వ్యవహారాలే కారణమని ఆంధ్రప్రదేశ్‌ డాక్టర్స్‌ అసోసియేషన్‌ స్పష్టం చేసిన విషయం తెలిసిందే.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top