
మభ్య పెట్టే ‘జన్మభూమి-మాఊరు’
ప్రజల్ని మభ్య పెట్టేందుకే ప్రభుత్వం జన్మభూమి-మాఊరు కార్యక్రమాన్ని మళ్లీ తెరపైకి తెచ్చిందని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి అమరనాథ్రెడ్డి పేర్కొన్నారు.
రాజంపేట:
ప్రజల్ని మభ్య పెట్టేందుకే ప్రభుత్వం జన్మభూమి-మాఊరు కార్యక్రమాన్ని మళ్లీ తెరపైకి తెచ్చిందని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి అమరనాథ్రెడ్డి పేర్కొన్నారు. ఆకేపాటి భవన్లో శనివారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ జన్మభూమి కార్యక్రమాన్ని అట్టహాసంగా నిర్వహించడం తప్ప, ప్రజలను ఒరిగేదేమీలేదన్నారు. జన్మభూమికి కేటాయించిన నిధులు మంత్రులు, అధికారులు తిరిగేందుకే సరిపోతాయన్నారు. జిల్లాలో 30వేల పింఛన్లు తొలగించారన్నారు. రుణమాఫీ అంటూ రైతులను, డ్వాక్రా మహిళలలను బురిడీ కొట్టించారన్నారు.
ఎన్నో ఆశలతో అధికారంలో కూర్చోబెట్టిన జనాన్ని నట్టేట ముంచడమే ధ్యేయంగా టీడీపీ ప్రభుత్వం పని చేస్తోందని ఆయన విమర్శించారు. అవుట్సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగుల పొట్టకొట్టిన ప్రభుత్వానికి మనుగడ ప్రశ్నార్థకంగా మారబోతోందన్నారు. పింఛన్లకు అనేక రకాల అడ్డంకులు సృష్టించి అర్హులకు అన్యాయం చేశారని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వ తీరు ఇలాగే కొనసాగితే వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆధ్వర్యంలో ప్రజల పక్షాలన పోరాటం చేస్తామన్నారు. సంక్షేమ ఫలాలు పేదలకు అందేలా తమ పార్టీ కృషి చేస్తుందని ఆయన పేర్కొన్నారు.
వైఎస్ అభివృద్ధి కార్యక్రమాలకే..
దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో జరిగిన అభివృద్ధి పనులకే టీడీపీ ప్రజాప్రతినిధులు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేసుకోవాల్సిన దుస్థితి ఏర్పడిందని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి అమర్నాథ్రెడ్డి పేర్కొన్నారు. అంతేకాని చంద్రబాబు చేసిన అభివృద్ధి ఏమీ లేదనే విషయం ప్రజలందరికీ తెలిసిందేనన్నారు. ఈ విషయాన్ని గుర్తించి ప్రభుత్వం ప్రజలకు మేలు చేసేలా పాలన చేయాలని సూచించారు.