సమైక్యాంధ్ర పరిరక్షణే లక్ష్యంగా వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు వై.ఎస్.జగన్మోహన్రెడ్డి నాయకత్వంలో ఈ నెల 26న హైదరాబాద్లో
దండు కదులుతోంది
Oct 25 2013 2:47 AM | Updated on Jul 25 2018 4:09 PM
సాక్షి ప్రతినిధి, కాకినాడ :సమైక్యాంధ్ర పరిరక్షణే లక్ష్యంగా వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు వై.ఎస్.జగన్మోహన్రెడ్డి నాయకత్వంలో ఈ నెల 26న హైదరాబాద్లో నిర్వహిస్తున్న సమైక్యశంఖారావం సభకు తరలివెళ్లేందుకు జిల్లావాసులు సిద్ధమవుతున్నారు. రాష్ట్ర విభజన నిర్ణయంపై తిరుగులేని వ్యతిరేకతతో, సమైక్యంగా ఉంచడానికి సాగే సమరంలో తామూ భాగస్వాములు కావాలని ఉరకలెత్తే ఉత్సాహంతో వైఎస్సార్ సీపీ శ్రేణులు, అభిమానులు, ప్రజాసంఘాలు పెద్ద సంఖ్యలో తరలివెళ్లే ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. జిల్లాలో 85 రోజులు గా ఉవ్వెత్తున ఎగసిపడుతున్న సమైక్యాంధ్ర ఉద్యమంలో అన్నివర్గాల ప్రజలు భాగస్వాములయ్యా రు.
ఉద్యమానికి ఏపీఎన్జీఓలు తాత్కాలిక విరామం ఇచ్చిన నేపథ్యంలో సమైక్యాంధ్రకు కట్టుబడ్డ పార్టీగా వైఎస్సార్ సీపీ వివిధ రూపాల్లో ఉద్యమ కార్యాచరణతో ముందుకు కదులుతోంది. ఆ క్రమంలో నిర్వహిస్తున్న సమైక్యశంఖారావ సభకు తరలి వెళ్లేందుకు సకలజనులు తహతహలాడుతున్నారు. అవధులు దాటిన అభిమానంతో జిల్లా నుంచి కనీవినీ ఎరుగని రీతిలో వెళ్లాలనుకుంటున్న వారికి పార్టీ నాయకులు రవాణా, వసతి సౌకర్యాలు కల్పించడంలో నిమగ్నం కాగా మరోవైపు జిల్లా నలుమూలల నుంచి వేలాదిమంది హైదరాబాద్ బయల్దేరేందుకు స్వచ్ఛందంగా వాహనాలు ఏర్పాటు చేసుకుంటున్నారు.
జగన్ నాయకత్వంపై నమ్మకంతో..
పార్టీలతో సంబంధం లేకుండా జగన్ నాయకత్వంపై నమ్మకంతో ప్రజలు పనులు మానుకునైనా సమైక్య శంఖారావ సభకు వెళ్లాలనే పట్టుదలతో కనిపిస్తున్నారు. సభకు జిల్లా నుంచి అత్యధికులు హాజరు కావాలన్న పట్టుదలతో పార్టీ జిల్లా కన్వీనర్ కుడుపూడి చిట్టబ్బాయి ఆధ్వర్యంలో నియోజకవర్గాల కో ఆర్డినేటర్లు, అనుబంధ సంఘాల కన్వీనర్లు నియోజకవర్గాల వారీగా గురువారం పార్టీ నాయకులతో సమీక్షా సమావేశాలు నిర్వహించారు.
ఆది నుంచీ ఆ కుటుంబం వెన్నంటి..
మహానేత, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాం నుంచి జిల్లావాసులు ఆ కుటుంబం చేపట్టే ఏ కార్యక్రమానికైనా తామున్నామంటూ వెన్నంటి నిలుస్తున్నారు. వైఎస్ మరణానంతరం ఆయనను అభిమానించే వారి కష్టాల్లో అండగా నిలిచేందుకు జగన్మోహన్రెడ్డి జిల్లాకు పలు పర్యాయాలు వచ్చారు. ఓదార్పు యాత్ర, హరితయాత్రలతో పాటు ప్రజల పక్షాన జగన్మోహన్రెడ్డి చేపట్టిన ప్రతి పోరులోనూ జిల్లావాసులు భాగస్వాములయ్యారు. ఆ క్రమంలోనే కుల, మత, వర్గాలకతీతంగా హైదరాబాద్ సభకు తరలివెళ్లేందుకు సిద్ధమవుతున్నారు.
సకల వర్గాల సంఘీభావం
కాగా వైఎస్సార్ సీపీకి ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు సంఘీభావం ప్రకటిస్తున్నాయి. కాంగ్రెస్, టీడీపీల కుట్ర రాజకీయాలతో సుమారు 16 నెలల అక్రమ నిర్బంధం తర్వాత జననేత నిర్వహిస్తున్న తొలి బహిరంగసభ కావడంతో రాష్ర్ట సమైక్యతను కాపాడేందుకు ఏం చెబుతారు అనే ఆతృత ప్రతి ఒక్కరిలో కనిపిస్తోంది. రాష్ర్టభవిష్యత్ దశదిశ మార్చే సత్తా ఈ సభకు ఉందన్న నమ్మకం సమైక్యవాదుల్లో బలంగా ఉంది. పార్టీ శ్రేణులే కాక ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కార్మికులతో పాటు సామాన్య ప్రజలు కూడా సభలో పాల్గొనాలన్న ఉత్సుకత చూపుతున్నారు. ప్రతి నియోజకవర్గం నుంచి 20 నుంచి 30 బస్సులతోపాటు వందలాది వాహనాల్లో తరలి వెళ్లేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. కాకినాడ నుంచి హైదరాబాద్కు 23 బోగీలతో శుక్రవారం ప్రత్యేక రైలు కూడా వేయడంతో సమైక్యవాదులు స్వచ్ఛందంగా ఈ రైలులో తరలి వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు.
Advertisement


