డీఎస్సీ–2018 అభ్యర్థులకు నియామక ఉత్తర్వులు

Recruitment Orders For Andhra Pradesh DSC 2018 Candidates - Sakshi

వివిధ కేటగిరీల్లో వివాదాల్లేని 2,654 పోస్టుల భర్తీ

సాక్షి, అమరావతి : డీఎస్సీ–2018లో అర్హత సాధించి మెరిట్‌లో నిలిచిన అభ్యర్థులకు ఆయా జిల్లాల్లో కౌన్సెలింగ్‌ ద్వారా వారు కోరుకున్న స్కూళ్లలో నియమిస్తూ ఆదివారం పోస్టింగ్‌లు ఇచ్చారు. కడపలో ఉప ముఖ్యమంత్రి అంజాద్‌ బాషా, విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌లు.. ఎంపికైన అభ్యర్థులకు ఈ నియామక పత్రాలు అందజేశారు. డీఎస్సీ–2018లో 7,902 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ ఇచ్చారు. వీటిలో ఎలాంటి న్యాయ వివాదాలు లేని వివిధ కేటగిరీల్లోని 2,654 పోస్టులకు ఆదివారం ఈ నియామక ఉత్తర్వులిచ్చారు. మిగిలిన పోస్టులకు సంబంధించిన వ్యాజ్యం త్వరలో హైకోర్టులో విచారణకు రానుంది. ఇది పరిష్కారమైతే ఆ పోస్టులకూ వెంటనే నియామక ఉత్తర్వులు ఇస్తామని అధికార వర్గాలు వివరించాయి.

బీసీ గురుకులాల్లో 322 టీచర్‌ పోస్టులు భర్తీ
మహాత్మా జ్యోతీరావు పూలే బీసీ సంక్షేమ గురుకుల విద్యాలయాల్లో 322 టీచర్‌ పోస్టులు భర్తీ అయ్యాయి. గురుకుల సొసైటీ కార్యదర్శి ఎ కృష్ణమోహన్‌ ఆదివారం కౌన్సెలింగ్‌ నిర్వహించి నియామక పత్రాలు అందజేశారు. 2018 డీఎస్సీలో 404 ఖాళీల భర్తీకి సంబంధించి గురుకుల సొసైటీ ప్రభుత్వానికి వివరాలు ఇవ్వగా అందులో 322 పోస్టులు భర్తీ చేసేందుకు అభ్యర్థులను ఎంపిక చేశారు. ఇందులో పీజీటీ, టీజీటీ, డ్రాయింగ్, మ్యూజిక్‌ టీచర్‌ పోస్టులు ఉన్నాయి. జోన్‌–1 (శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం) నుంచి 78 మంది, జోన్‌–2 (తూర్పు గోదావరి, పశి్చమ గోదావరి, కృష్ణా జిల్లాలు)నుంచి 26 మంది, జోన్‌–3 (గుంటూరు, ప్రకాశం, ఎస్పీఎస్‌ఆర్‌ నెల్లూరు) నుంచి 56 మంది, జోన్‌–4 (చిత్తూరు, అనంతపురం, కర్నూలు, వైఎస్సార్‌ కడప) 162 మంది ఎంపికయ్యారు. మొత్తం పోస్టు గ్రాడ్యుయేట్‌ టీచర్లు 132 మంది, ట్రైన్డ్‌ గ్రాడ్యుయేట్‌ టీచర్లు 148 మంది, డ్రాయింగ్‌ టీచర్లు 18 మంది, క్రాఫ్ట్‌ టీచర్లు 12 మంది, మ్యూజిక్‌ టీచర్లు 12 మంది ఉన్నారు. బీసీ గురుకులాల్లో సుమారు 20 సంవత్సరాల నుంచి శాశ్వత టీచర్‌ పోస్టులు భర్తీ చేయలేదు. నూతనంగా అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం 2018 డీఎస్సీ అభ్యర్థుల విషయంలో ఉన్న కోర్టు అభ్యంతరాలను పరిష్కరించి అడుగులు ముందుకు వేసింది.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top