విద్యార్థుల భవిష్యత్‌తో చెలగాటం | playing with the students future | Sakshi
Sakshi News home page

విద్యార్థుల భవిష్యత్‌తో చెలగాటం

Jun 26 2015 4:52 AM | Updated on Oct 22 2018 7:32 PM

కార్పొరేట్ విద్య పథకం కింద దరఖాస్తు చేసుకున్న ప్రతిభావంతుల భవిష్యత్‌తో అధికారులు చెలగాటమాడుతున్నా రు. సాంఘిక సంక్షేమ శాఖ

అనంతపురం సిటీ : కార్పొరేట్ విద్య పథకం కింద దరఖాస్తు చేసుకున్న ప్రతిభావంతుల భవిష్యత్‌తో అధికారులు చెలగాటమాడుతున్నా రు. సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ప్రతిభావంతులకు కార్పొరేట్ విద్య పథకం ద్వారా దరఖాస్తు చేసుకోవాలని విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. దీం తో జిల్లా నలుమూలల నుంచి ప్రతిభావంతులైన విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఈ నెల 15వ తేదీకి గడువు ముగిసింది. పలువురు విద్యార్థులకు  ‘కళాశాలలో మీకు సీటు వచ్చింది, కంగ్రాట్యులేషన్స్’ అని ఒక మెసేజ్, ఒరిజినల్ సర్టిఫికెట్లతో కౌన్సెలింగ్‌కు హాజరు కావాలని మరో మెసేజ్ వచ్చాయి. తీరా ఇక్కడికి వస్తే కేటగిరీ తప్పు దరఖాస్తు చేసుకున్న కారణంగా సీట్లు ఇవ్వలేమంటూ అధికారులు చేతులెత్తేశారు.

 కొంప ముంచిన మెసేజ్
 సీటు వచ్చిందని తన సెల్‌ఫోన్‌కు వచ్చిన మెసేజ్ ఓ విద్యార్థి భవిష్యత్‌ను ప్రశ్నార్థకంలో పడేసింది. బుక్కరాయసముద్రం మండలం బొమ్మలాటపల్లికి చెందిన పి.కళ్యాణ్‌కుమార్ బి.పప్పూరులోని ఏపీఎస్‌డబ్ల్యూఓ గురుకుల పాఠశాలలో 10 తరగతి చదివాడు. 9.5 శాతం జీపీ సాధిం చాడు. ప్రతిభావంతుల కోటాలో చైతన్య కళాశాలలో సీటు వచ్చినట్లు డెరైక్టరేట్ ద్వారా మెసేజ్ వచ్చింది. అయితే ఇప్పటికే ప్రవేశ పరీక్ష ద్వారా కర్నూలు జిల్లాలోని చిన్నటేకూరు మ్యాగ్నెట్ కళాశాలలో ఉచితంగా సీటు సంపాదించాడు.

అయితే సొంత జిల్లాలో సీటు వచ్చిందన్న ఆనందంతో అక్కడి యాజమాన్యం ఒ ప్పుకోకపోయినా అష్టకష్టాలూ పడి అడ్మిషన్ ఫీజు చెల్లించి టీసీ తీసుకుని వచ్చా డు. తీరా ఇక్కడికి వస్తే కేటగిరీ తప్పు అంటూ సీటు ఇవ్వలేదు. అసలే తన తండ్రి వికలాంగుడని అక్కడా సీటు  లేక, ఇక్కడా ఇవ్వకుంటే ఎక్కడికి వెళ్లాలని కన్నీటి పర్యంతమయ్యాడు. ఇలా కళ్యాణ్‌కుమార్, జెస్సికా తదితర 15 మంది విద్యార్థులు ఏమి చేయాలో దిక్కుతోచని పరిస్థితిలో పడిపోయారు.

 తప్పంతా డెరైక్టరేట్ అధికారులదే..!
 సాంఘిక సంక్షేమ శాఖ డీడీ బదిలీల విషయమై కలెక్టరేట్‌లో ఉండగా విద్యార్థులు, తల్లిదండ్రులు సిబ్బందిని ఈ విషయమై ప్రశ్నించారు. అందుకు సీనియర్ అసిస్టెంట్ సమాధానమిస్తూ తప్పంతా డెరైక్టరేట్ అధికారులదేనన్నారు. అక్కడ వారు జాబితా చూడకుండా సీరియల్ ప్రకారం మెసేజ్‌లు పంపారంటూ పోలీసులను పిలిపించి విద్యార్థులను గెంటేయించారు. దరఖాస్తు చేసుకున్న అనంతరం కార్యాలయంలో అందించినప్పుడైనా పరిశీలించారా అని ప్రశ్నిస్తే నీళ్లు నమిలారు.

 డెరైక్టరేట్‌కు పంపి రెండో జాబితాలో న్యాయం చేస్తాం:డీడీ
 బదిలీల విషయమై బిజీగా ఉన్నానని, వినతి పత్రాన్ని రాసి ఇస్తే డెరైక్టరేట్‌కు పంపి రెండవ జాబితాలో సీట్లు వచ్చేలా చూస్తామని ఆ శాఖ డీడీ బి.జీవపుత్రకుమార్ తెలిపారు. విద్యార్థులకు ఎట్టి పరిస్థితుల్లోనూ అన్యాయం జరగనీయమన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement