కొలువుదీరిన కొత్త పాలకమండలి

New TTD Counsil Members Oath On Monday In Tirupati - Sakshi

సాక్షి, తిరుపతి : తిరుమల తిరుపతి దేవస్థానం నూతన ధర్మకర్తల మండలి కొలువుదీరింది. ఆ వెంటనే చైర్మన్‌ అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. తొలి సమావేశంలోనే పలు కీలకమైన నిర్ణయాలు తీసుకున్నారు. ముఖ్యంగా కలియుగదైవం శ్రీవేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించాలని నిర్ణయించారు. శ్రీవారి బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేయాలని నిర్ణయిం చారు. అమరావతిలో టీటీడీ నిధులతో నిర్మించనున్న శ్రీవారి ఆలయానికి గత ప్రభుత్వం అంచనాలకు మించి జరిపిన కేటాయింపులను కుదిం చారు.  తిరుమల శాశ్వత తాగునీటి పరిష్కారా నికి బాలాజీ రిజర్వాయర్‌ పూర్తిచేయాలని నిర్ణ యం తీసుకున్నారు. పెండింగ్‌లో ఉన్న అనేక అభివృద్ధి పనులు పూర్తిచేసే విషయమై చర్చిం చారు.

ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన టీటీడీ పాలకమండలి సభ్యులు సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు. వారితో పాటు ప్రత్యేక ఆహ్వానితులు ఏడుగురు ప్రమాణస్వీకారం చేశారు. అనంతరం తిరుమల అన్నమయ్య భవన్‌లో టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి అధ్యక్షతన తొలి పాలకమండలి సమావేశం జరిగింది. ఈనెల 30 నుంచి శ్రీవారి బ్రహ్మోత్సవాలను బ్రహ్మాండంగా నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా ఏర్పాట్లు చేసేలా అధికార యంత్రాంగానికి ఆదేశాలు జారీ చేశారు. అందులో భాగంగా తిరుమలలో బ్రహ్మోత్సవ ఏర్పాట్లలో అధికారులు, సిబ్బంది బిజీబిజీగా ఉన్నారు.

తిరుమల శాశ్వత తాగునీటి సమస్య పరిష్కారం దిశగా..
తిరుమల శ్రీవారి దర్శనం కోసం వచ్చే భక్తులు, అధికారులు, స్థానికులకు మంచినీటి సమస్య లేకుండా ఉండేందుకు శాశ్వత పరిష్కారం దిశగా పాలకమండలి నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగా బాలాజీ రిజర్వాయర్‌ను పూర్తి చేసి అక్కడి నుంచి మల్లిమడుగు, కళ్యాణి డ్యాం నుంచి నీటిని సరఫరా చేసే విషయమై చర్చిం చారు. ఈ విషయమై గతంలోనే చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి బాలాజీ రిజర్వాయర్‌ని పరిశీలించిన విషయం తెలిసిందే. బాలాజీ రిజర్వాయర్‌ పనులు పూర్తి చేసేందుకు అవసరమైన నిధుల కేటాయింపు వంటి వాటి గురించి సమావేశంలో ప్రస్తావించారు. బాలాజీ రిజర్వాయర్‌ పూర్తి చేసేందుకు రూ.150 కోట్లు అంచనా వేసినట్లు తెలిసింది. అందుకు సంబంధించిన అంచనాలను వచ్చే పాలకమండలి సమావేశంలోపు సమర్పించాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు ఇచ్చి నట్లు తెలిసింది. తిరుపతిలో నిర్మాణంలో ఉన్న గరుడ వారధి నిర్మాణానికి టీటీడీ నిధులు కేటాయించే విషయమై ప్రభుత్వంతో చర్చించి నిర్ణయం తీసుకోవాలని నిర్ణయించినట్లు సమాచారం.

అవిలాల చెరువు సుందరీకరణ పనులు పూర్తి చేయాలని నిర్ణయం తీసుకున్నారు. తిరుమలలో కాలుష్య రహిత వాహనాల విషయమై చర్చిం చారు. అందులో భాగంగా తిరుమలలో ఎలక్ట్రికల్‌ కార్లు, బస్సులు నడపాలని నిర్ణయించారు. టీటీడీలో పనిచేస్తున్న కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలపై సబ్‌ కమిటీ వేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఆరు నెలలుగా పెండింగ్‌లో ఉన్న పలు అంశాలపై చర్చించారు. పాలనాపరమైన ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకునేందుకు ప్రణాళికలు రూపొందిం చారు. టీటీడీ నూతన పాలకమండలి ప్రమాణస్వీకారం చేసిన వెంట నే సమావేశం ఏర్పాటు చేసి, కీలకమైన నిర్ణయాలు తీసుకోవడంపై టీటీడీ అధికారులు, సిబ్బంది, భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top