సీఎం కార్యదర్శిపై టీడీపీ ఎమ్మెల్యే వీరంగం | Mahender reddy scolds CM Secretary | Sakshi
Sakshi News home page

సీఎం కార్యదర్శిపై టీడీపీ ఎమ్మెల్యే వీరంగం

Feb 13 2014 4:20 AM | Updated on Sep 27 2018 3:20 PM

ముఖ్యమంత్రి కార్యాలయ కార్యదర్శి, సీనియర్ ఐఏఎస్ అధికారి శ్రీధర్‌పై టీడీపీ ఎమ్మెల్యే పి.మహేందర్‌రెడ్డి అసభ్య పదజాలంతో దూషిస్తూ విరుచుకుపడ్డారు.

సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి కార్యాలయ కార్యదర్శి, సీనియర్ ఐఏఎస్ అధికారి శ్రీధర్‌పై టీడీపీ ఎమ్మెల్యే పి.మహేందర్‌రెడ్డి అసభ్య పదజాలంతో దూషిస్తూ విరుచుకుపడ్డారు. వారిద్దరూ గట్టిగా అరుచుకోవడంతో అక్కడే ఉన్న పలువురు ఐఏఎస్ అధికారులు, ఇతర ఉన్నతాధికారులు అవాక్కయ్యారు. బుధవారం అసెంబ్లీలోని సీఎం చాంబర్ సమీపంలోనే ఈ సంఘటన జరిగింది. విశ్వసనీయవర్గాల సమాచారం ప్రకారం.. మహేందర్‌రెడ్డికి సంబంధించిన మెడికల్ కాలేజీ ఫైలుపై శ్రీధర్ వ్యతిరేక నోట్ పొందుపరిచారు. దీంతో అది పెండింగ్‌లో పడింది. దీనిపై మాట్లాడేందుకు మహేందర్‌రెడ్డి అక్కడికి వచ్చారు. శ్రీధర్ వద్దకు వెళ్లి ఫైల్‌పై వ్యతిరేకంగా ఎందుకు రాశారని ఆవేశంగా ప్రశ్నించారు. అక్కడున్న పరిస్థితిపై తనకు అందిన నివే దికలను అనుసరించి అలా రాశానని శ్రీధర్ చెప్పారు. అలా ఎందుకు రాస్తావు.. ఇలా రాయాలి కదా అంటూ మహేందర్  ఒక నోట్‌ను ఆయనకు చూపించారు.
 
 మీరు చెప్పినట్లు రాయడానికి తాను ఇక్కడ లేనని, తనకు జీతం ఇస్తున్నది ప్రభుత్వం తప్ప మీరు కాద ని, కావాలంటే సీఎంకు ఫిర్యాదు చేసుకోవచ్చని శ్రీధర్ స్పష్టంచేశారు. కోపం పట్టలేని మహేందర్ తీవ్రపదాలతో శ్రీధర్‌పై విరుచుకుపడ్డారు. ఒకరిపై ఒకరు అరుచుకుంటుండంతో అక్కడే ఉన్న సీనియర్ ఐఏఎస్ అధికారులు జవహర్‌రెడ్డి, రావత్‌లు సర్దిచెప్పేందుకు ప్రయత్నించారు. మహేందర్ తీవ్రంగా హెచ్చరించి అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఈ ఘటనను శ్రీధర్, ఇతర అధికారులు సీఎం దృష్టికి తీసుకెళ్లారు. మహేందర్‌రెడ్డి తీరుపై ఐఏఎస్ అధికారుల సంఘానికి, ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయాలని నిర్ణయించారు. విధుల్లో ఉన్న ఐఏఎస్ అధికారులకు ఆటంకం కలిగించిన, దాడులకు తెగబడిన ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులను మళ్లీ  పోటీ కి వీల్లేకుండా అనర్హులుగా ప్రకటించే అవకాశమున్నందున మహేందర్‌పై ఆ విధమైన చర్యలు తీసుకొనేలా ఈసీకి ఫిర్యాదు చేయాలని నిర్ణయించామని సీనియర్ ఐఏఎస్ అధికారి ఒకరు తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement