లోక్‌అదాలత్‌లతో సత్వర న్యాయం | Lok Adalats brings quick justice to people says mohammed bande ali | Sakshi
Sakshi News home page

లోక్‌అదాలత్‌లతో సత్వర న్యాయం

Sep 29 2013 4:43 AM | Updated on Sep 1 2017 11:08 PM

రాజీమార్గాన్ని అనుసరించి లోక్‌అదాలత్‌ల ద్వారా సత్వర పరిష్కారం పొందవచ్చని సీనియర్ సివిల్ జడ్జి, న్యాయసేవ సంస్థ కార్యదర్శి మహ్మద్ బందేఅలీ అన్నారు.

నాందేవ్‌వాడ, న్యూస్‌లైన్ : రాజీమార్గాన్ని అనుసరించి లోక్‌అదాలత్‌ల ద్వారా సత్వర పరిష్కారం పొందవచ్చని సీనియర్ సివిల్ జడ్జి, న్యాయసేవ సంస్థ కార్యదర్శి మహ్మద్ బందేఅలీ అన్నారు. జిల్లా న్యాయసేవ సంస్థ ఆధ్వర్యంలో శనివారం బ్యాంకు లోక్‌అదాలత్‌ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా కక్షిదారులను ఉద్దేశించి మాట్లాడుతూ కోర్టుల్లో కేసు తీర్పులు వచ్చినప్పుడు గెలిచినవారు, ఓడిన వారు ఉంటారని, కానీ లోక్‌అదాలత్ తీర్పుల ద్వారా ఇరుపక్షాల వారు గెలుస్తారన్నారు. లోక్‌అదాలత్ తీర్పులు అంతిమమైనవని, అప్పీలుకు వీలు లేనివన్నారు. బ్యాంకుల రుణ రికవరీ కేసులలో లోక్‌అదాలత్‌లు నిర్వహించడం వల్ల అందరికీ లాభం చేకూరుతుందన్నారు. ఇలాంటి లోక్‌అదాలత్‌లలో బ్యాంకుల వారు వడ్డీమాఫీ, సులభ వాయిదాలు ఇచ్చే అవకాశాలుంటాయని, కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
 
 మొత్తం 38 కేసులు పరిష్కారం
 బ్యాంకు లోక్‌అదాలత్‌లో మొత్తం 38 కేసులు పరిష్కారమయ్యాయి. న్యాయమూర్తులు మహ్మద్ బందేఅలీ, అమరావతిలు లోక్‌అదాలత్ బెంచీలకు అధ్యక్షత వహించి కేసులను పరిష్కరించారు. భారతీయ స్టేట్ బ్యాంకు వారు దాఖలు చేసిన కేసులలో 16 కేసులు పరిష్కారమయ్యాయి. దేనా బ్యాంకు వారు దాఖలు చేసిన కేసులలో 22 కేసులు రాజీమార్గంలో పరిష్కారమయ్యాయి. మొత్తం 38 కేసులలో లోక్‌అదాలత్ శనివారం రాజీ అవార్డులను జారీ చేసింది. న్యాయవాదుల సంఘ అధ్యక్షుడు రాజ్‌కుమార్‌సుబేదార్, న్యాయవాది అంకిత లోక్‌అదాలత్ సభ్యులుగా వ్యవహరించారు. బ్యాంకు అధికారులు రాజేంద్రబాబు, వెంకటేశ్వరరావు, గిరిధర్‌గౌడ్, విజయచౌహన్, దేనాబ్యాంకు లీగల్ అడ్వయిజర్ సాయరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement