కన్నాకు టీడీపీ అక్రమాలు కన్పించలేదా? | Kasu Mahesh Reddy Comments On Kanna Laxminarayana | Sakshi
Sakshi News home page

కన్నాకు టీడీపీ అక్రమాలు కన్పించలేదా?

Aug 12 2019 2:13 PM | Updated on Aug 12 2019 3:39 PM

Kasu Mahesh Reddy Comments On Kanna Laxminarayana - Sakshi

సాక్షి, గుంటూరు : బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణకు టీడీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతి కన్పించడంలేదని, రెండు నెలల క్రితం బీజేపీలో చేరిన టీడీపీ నాయకుల చెప్పుడు మాటలు వింటున్నారని గురజాల వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే కాసు మహేష్‌రెడ్డి విమర్శించారు. ఈ నెల 16వ తేదీన గురజాలలో కన్నాలక్ష్మీనారాయణ ధర్నా చేస్తామన్నారు. గురజాలలో ఎందుకు ధర్నా చేస్తున్నారో అర్థం కావడంలేదని, గత ప్రభుత్వంలో గురజాలలో సున్నపురాయి దోపిడీ జరుగుతుంటే అప్పుడు ఎందుకు ధర్నా చేయలేదని మండిపడ్డారు. ‘తెలుగుదేశం ప్రభుత్వం ఇష్టంవచ్చినట్లు  అక్రమ కేసులు పెడితే ఎందుకు మాట్లాడలేదు. మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు అరాచకాలు చేస్తే ప్రశ్నించలేదు. ఇప్పటికైనా స్థానిక బీజేపీ నాయకుల ద్వారా నిజాలు తెలుసుకోవాలని’ కన్నాకు సూచించారు.

గత ప్రభుత్వంలో జరిగిన అక్రమ మైనింగ్, అక్రమ గ్రానైట్, నకిలీ విత్తనాలు, గంజాయి, పేకాట వంటి అసాంఘిక కార్యక్రమాలు ఇప్పుడు జరగకుండా అదుపు చేశాం. గడచిన 3 నెలల్లో గురజాలలో శాంతి భద్రతలు అదుపులోకి తెచ్చామన్నారు. 2 నెలల క్రితం టీడీపీ నుంచి బీజేపీలోకి వచ్చిన వారి మాటలు వింటే పచ్చ కామెర్ల వారికి అంత పచ్చగానే కనపడుతుందనేలాగే ఉంటుందని ఎద్దేవాచేశారు. చంద్రబాబు నాయుడు తన పార్టీ వారిని  బీజేపీలోకి పంపి మళ్ళీ 3సంవత్సరాల తర్వాత టీడీపీలో చేర్చుకుంటారని తెలిపారు. చంద్రబాబు ఉద్దేశం బీజేపీ భుజాలపైన గన్ను పెట్టి వైఎస్సార్‌సీపీపై దాడిచేయాలని, ఇప్పటికైనా బీజేపీ నాయకులు టీడీపీ దుర్మార్గాలను గ్రహించాలని సూచించారు. గతంలో ప్రతిపక్షాలు ధర్నాలు చేస్తుంటే చంద్రబాబు అక్రమ కేసులు పెట్టించారు. కానీ వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ధర్నా చేసే వారికి ప్రొటెక్షన్‌ కల్పించమని పోలీసు అధికారులకు సూచిస్తుంది అని పేర్కొన్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement