ఉలికిపాటు.. అంతలోనే ఆనందం! | Indian Air Force chopper makes emergency landing in farm | Sakshi
Sakshi News home page

ఉలికిపాటు.. అంతలోనే ఆనందం!

Mar 23 2018 1:43 PM | Updated on Jun 4 2019 5:16 PM

Indian Air Force chopper makes emergency landing in farm - Sakshi

మరమ్మతులు చేపడతున్న ఇంజినీరింగ్‌ సిబ్బంది ,సెల్ఫీతీసుకుంటున్న సోంపేటకు చెందిన ఓ కుటుంబం

సమయం గురువారం మిట్టమధ్యాహ్నం ఒంటిగంట.. జనమంతా ఎవరి పనుల్లో వారు నిమగ్నమై ఉన్నారు. ఇంతలో పెద్ద శబ్దంతో హెలికాప్టరొకటి సోంపేట మండలం శారదాపురం గ్రామ సమీపంలోని పొలాల్లో దిగిపోయింది. దీంతో జనమంతా ఉలికిపాటుకి గురయ్యారు. ఏం జరిగిందోనని తీవ్ర ఆందోళన చెందారు. ఎప్పుడూ ఆకాశ మార్గంలో వెళ్లేటపుడు మాత్రమే హెలికాప్టర్‌ను చూసే గ్రామీణులు తమ పరిసరాల్లో అకస్మాత్తుగా దిగిపోవడంతో ఏం జరిగి ఉంటుందోనని గందరగోళానికి గురయ్యారు. ఇంతలో సాంకేతిక లోపంతో హెలికాప్టర్‌ దిగినట్టు తెలుసుకొని ఊపిరి పీల్చుకున్నారు. పాడైన దాన్ని బాగు చేసేందుకు సాంకేతిక సిబ్బంది మరో హెలికాప్టర్‌లో రావడం..అది కూడా పొలంలోనే దిగడంతో.. ఒకేసారి రెండింటినీ చూసిన సోం³ట మండల వాసులు ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయ్యారు.

సోంపేట:   పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రం బక్రాపూర్‌ నుంచి చెన్నై వెళ్తున్న ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన హెలికాప్టర్‌లో సాంకేతిక సమస్య తలెత్తింది. దీంతో  అప్రమత్తమైన పైలట్‌ గురుప్రీత్‌ సింగ్‌ గురువారం మధ్యాహ్నం 1:10 గంటల సమయంలో సోంపేట మండలం శారదాపురం గ్రామ సమీపంలోని పొలాల్లో అత్యవసరంగా ల్యాండ్‌ చేశారు.    హెలికాప్టర్‌లో పైలట్‌ సింగ్‌తో సహా సి బ్బంది ప్రశాంత్, కిరణ్‌టాకోన్‌ ఉన్నారు. హెలి కాప్టర్‌ పాడైన విషయాన్ని విశాఖలోని ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్‌ విభాగానికి సమాచారం అందజేశారు. దీంతో నావికాదళానికి చెందిన ప్రత్యేక హెలికాప్టర్‌లో సాంకేతిక బృందం సుమా రు నాలుగు గంటల సమయంలో శారదాపురం చేరుకున్నారు. మరమ్మతులకు గురైన హెలికాప్టర్‌ పైలట్‌ సింగ్‌తో సిబ్బంది మాట్లాడారు. 30 నిమిషాల్లోనే సాంకేతిక సమస్యను పరిష్కరిం చారు. అనంతరం రెండు హెలికాప్టర్లు ఒడిశా రాష్ట్రంలోని  గోపాల్‌పూర్‌కు సాయంత్రం 5:10 గంటల సమయంలో బయలుదేరి వెళ్లిపోయా యి. కాగా రక్షణ విభాగానికి చెందిన హెలికాప్టర్లు కావడంతో సంబంధిత అధికారులు అప్రమత్తమయ్యారు. ఒడిశా రాష్ట్రం గోపాల్‌పూర్‌ క్యాంపు కార్యాలయంలో అందుబాటులో ఉన్న ఆర్మీ సిబ్బందిని శారదాపురానికి పంపించారు.  

ఆసక్తి చూపిన జనం.. ఒక హెలికాప్టర్‌ సాంకేతిక లోపంతో పొలాల్లో దిగిందని, దాన్ని బాగు చేసేందుకు మరకొటి వచ్చిందని తెలుసుకున్న శారదాపురంతోపాటు పరిసర గ్రామాల ప్రజలు వాటిని చూసేందుకు ఘటనా స్థలానికి చేరుకున్నారు. కొంతమంది హెలికాప్టర్ల ఫొటోలను సెల్‌ఫోన్లలో బంధించారు. మరికొందరు సెల్ఫీలు తీసుకున్నారు. సోంపేట సీఐ సన్యాసినాయుడు, బారువ, సోంపేట ఎస్సైలు భాస్కరారవు, దుర్గా ప్రసాద్‌లు హెలికాప్టర్ల వద్దకు  స్థానికులను వెళ్లనీయకుండా చర్యలు చేపట్టారు.

Advertisement
 
Advertisement
Advertisement