
‘మోహనా లే నాన్న లేయ్. కళ్లు తెరు.... ఏం కాదు ఆస్పత్రికి వచ్చేశాం.. కాసేపట్లో డాక్టర్ చూస్తారు లేనాన్న లేయ్’ అంటూ ఓ తండ్రి తన కుమారున్ని రెండు చేతులతో ఎత్తుకుని సర్వజనాస్పత్రిలోకి పరుగు తీస్తూ రావడం అందరినీ కలిచివేసింది. అత్యవసర చికిత్స విభాగంలో పరీక్షించిన వైద్యులు వెంటనే అడ్మిట్ చేయాలని సూచించడంతో మూడో అంతస్తులోని చిన్న పిల్లల వార్డుకు బిడ్డను మోసుకుంటూ అతి కష్టంపై చేరుకున్నాడు. హృదయవిదారకరమైన ఈ ఘటన మంగళవారం అనంతపురం సర్వజనాస్పత్రిలో చోటు చేసుకుంది.
అనంతపురం న్యూసిటీ: కదిరి పుల్గంపల్లికు చెందిన వెంకటరమణ కుమారుడు మోహన్(11) గుత్తిలోని మోడల్ స్కూల్లో ఐదో తరగతి చదువుతున్నాడు. కొన్ని రోజులుగా జ్వరంతో బాధపడుతున్నట్లు స్కూల్ ఉపాధ్యాయుల నుంచి సమాచారం అందుకున్న తండ్రి వెంకటరమణ మంగళవారం గుత్తికి చేరుకుని కుమారుడిని పిలుచుకుని సొంతూరుకు బయలుదేరాడు. అనంతపురంలోని బస్టాండ్కు చేరుకోగానే జ్వరం తీవ్రత కారణంగా మోహన్ కళ్లు తేలేస్తూ అపస్మారక స్థితికి చేరుకున్నాడు. దీంతో తండ్రి కన్నీటి పర్యాంతమవుతూ కుమారుడిని ఆటోలో సర్వజనాస్పత్రికి తీసుకొచ్చారు. అక్కడ స్ట్రెచ్చర్ లేకపోవడంతో బిడ్డ ప్రాణాలు కాపాడుకునేందుకు నరకయాతన అనుభవించాడు. ఓ దశలో సోలిపోయిన కుమారుడిని మోయలేక రోదిస్తూ ఓపీ బ్లాక్ వద్ద ఆగిపోయాడు. అక్కడే ఉన్న శానిటరీ ఇన్స్పెక్టర్ లక్ష్మణ్ణ, ఎంఎన్ఓ రమణయ్య సాయచేయడంతో మూడో అంతస్తుకు చేరుకున్నాడు. డ్యూటీ డాక్టర్ ప్రత్యూష మెరుగైన సేవలందించడంతో మోహన్ పరిస్థితి కుదుటపడింది. ప్రస్తుతం మోహన్ కోలుకుంటున్నట్లు వైద్యులు తెలిపారు.