
దళితులపై సీఎం చంద్రబాబుది కపట ప్రేమ
దళితుల అభ్యున్నతిపై సీఎం చంద్రబాబుకు చిత్తశుద్ధి లేదనే విషయం కాగ్ నివేదికతో మారోమారు ....
వైఎస్సార్ సీపీ మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు కైలే జ్ఞానమణి
హనుమాన్జంక్షన్ రూరల్ : దళితుల అభ్యున్నతిపై సీఎం చంద్రబాబుకు చిత్తశుద్ధి లేదనే విషయం కాగ్ నివేదికతో మారోమారు స్పష్టమైందని వైఎస్సార్ సీపీ మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు, బాపులపాడు జెడ్పీటీసీ సభ్యురాలు కైలే జ్ఞానమణి అన్నారు. స్థానిక విలేకరులతో గురువారం ఆమె మాట్లాడారు. కాగ్ విడుదల చేసిన తాజా నివేదికలో ఎస్సీ, ఎస్టీ సబ్ప్లాన్ అమలులో రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం వహించినట్లు తేల్చిచెప్పటం సీఎం చంద్రబాబు అసమర్ధతకు అద్దం పడుతోందని విమర్శించారు. సబ్ప్లాన్లో కేటాయించిన నిధుల్లో ఎస్సీలకు కేవలం 31 శాతం నిధులను మాత్రమే ఖర్చు పెట్టినట్లు కాగ్ నివేదించటంపై తెలుగుదేశం ప్రభుత్వం దళితులకు సమాధానం చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు.
వాస్తవానికి సబ్ప్లాన్ ద్వారా ఎస్సీలకు కేటాయించాల్సిన నిధుల కంటే తక్కువ మొత్తాన్ని తెలుగుదేశం ప్రభుత్వం గత ఏడాది కేటాయించిందని, అయినప్పటికీ ఆ నిధులను కూడా ఖర్చు చేయకుండా దళితులకు తీవ్ర అన్యాయం చేసిందని దుయ్యబట్టారు. గత ఎన్నికల్లో దళిత జాతి అధికంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేసిందనే కక్షతోనే సీఎం చంద్రబాబు ఈ దుశ్చర్యకు పాల్పడుతున్నారని జ్ఞానమణి ఆరోపించారు.