హోదా కంటే ప్యాకేజీయే కావాలన్నారు | Chandrababu Intrested In Package Not Special Status Said By Purandeshwari | Sakshi
Sakshi News home page

హోదా కంటే ప్యాకేజీయే కావాలన్నారు

Mar 13 2019 4:51 PM | Updated on Mar 13 2019 4:57 PM

Chandrababu Intrested In Package Not Special Status Said By Purandeshwari - Sakshi

సాక్షి, నర్సీపట్నం: ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్రానికి ప్రత్యేక హోదా కంటే ప్రత్యేక ప్యాకేజీనే సంజీవిని అన్నారని బీజేపీ మహిళామోర్చా జాతీయ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి అన్నారు. రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో టీడీపీ సర్కార్‌ నాశనం చేసిందని మండిపడ్డారు. మంగళవారం నర్సీపట్నం వచ్చిన ఆమె విలేకరులతో మాట్లాడారు. ప్రత్యేక ప్యాకేజీని చంద్రబాబు కోరడంతోనే కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి వేల కోట్ల రూపాయలు విడుదల చేసిందన్నారు. రాష్ట్రాన్ని అడ్డుగోలుగా విభజించిన కాంగ్రెస్‌ పార్టీ ప్రత్యేక హోదా ఇస్తామనడంలో అర్థంలేదన్నారు.

రాష్ట్ర విభజన సమయంలోనే ప్రత్యేక హోదా ఇచ్చి ఉండాల్సిందన్నారు. ఓట్ల తొలగింపుపై వచ్చిన ఫారం–7 దరఖాస్తుల అంశాన్ని ఎన్నికల కమిషన్‌ దృష్టికి తీసుకెళ్లామన్నారు. ఎన్నికల్లో తాను ఎక్కడి నుంచి పోటీ చేయాలనేది అధిష్టానమే నిర్ణయిస్తుందని చెప్పారు. దేశంలో అవినీతిరహిత పాలన అందించిన ఘనత ప్రధానమంత్రి నరేంద్రమోదీకి దక్కిందన్నారు. పాకిస్తాన్‌ భూభాగంలో ఉన్న ఉగ్రవాద స్థావరాలపై భారత సైనికులు దాడులు చేసి 130 కోట్ల మంది భారతీయుల సత్తా చాటారన్నారు. సమావేశంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు పొన్నగంటి అప్పారావు, అసెంబ్లీ నియోజకవర్గం కన్వీనర్‌ కాళ్ల సుబ్బారావు పాల్గొన్నారు.
 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement