బాబుకే అప్పు ఇచ్చాం.. నన్ను ఏం చేయలేరు

Call Money Type Incident In Chittoor - Sakshi

టీడీపీ నేత కాల్‌మనీ తరహా వేధింపులు

అప్పు తీర్చినా బాధితులకు తప్పని కష్టాలు

సాక్షి, తిరుపతి : పాకాలలోని ఓ టీడీపీ నేత కాల్‌మనీ తరహా వేధింపులకు పాల్పడుతున్నాడు. కొన్నేళ్లుగా పాకాల మండల కేంద్రంగా ఈ తంతు సాగుతోంది. ఈ వేధింపులకు తాళలేక బాధితులు న్యాయం కోసం పోలీసులను ఆశ్రయించినా పట్టించుకోకపోవడంతో ఆందోళనకు దిగుతున్నారు. 

అసలేం జరిగిందంటే
పాకాల కమ్మవీధికి చెందిన గోవర్దన్‌బాబు నాయుడు అలియాస్‌ గోపీనాయుడు కొన్నేళ్లుగా వడ్డీ వ్యాపారం చేస్తున్నాడు. బాధితుల నుంచి బాండు, ఖాళీ చెక్కులు తీసుకుంటున్నాడు. వడ్డీ, తీసుకున్న సొమ్ము తిరిగి చెల్లించినా బాధితులకు అతడు బాండు, చెక్కు తిరిగి ఇవ్వడం లేదు. ఇదేమని అడిగితే వేధింపులకు దిగుతున్నాడు. ఆపై తిరిగి సొమ్ము వసూలు చేయడం తంతుగా పెట్టుకుంటున్నాడు. నలుగురు కలిసి నిలదీస్తే మా నాన్న చంద్రబాబు నాయుడికే అప్పు ఇచ్చాడురా..! నేను టీడీపీ వాడ్ని ఎవ్వరూ ఏమీ చేయలేరు.. అంటూ దౌర్జన్యాలకు పాల్పడుతున్నాడు. డబ్బులిచ్చి పోలీసులను కూడా కొనేస్తానని బెదిరింపులకు పాల్పడుతున్నట్లు బాధితులు వాపోతున్నారు. మహిళలకు సైతం అప్పులు ఇవ్వడం, ఇచ్చిన అప్పు తీర్చినా తన కోరిక తీర్చాలని వేధించడం రివాజుగా మారిందని పలువురు ఆరోపించారు.

అరాచకాలు అరికట్టండి
అప్పు పేరుతో అమాయకులపై దౌర్జన్యానికి పాల్పడుతూ మోసం చేస్తున్న గోవర్దన్‌బాబు నాయుడి అరాచకాలను అరికట్టాలని పూతపట్టు మండలం, ముత్తురేవుల గ్రామానికి చెందిన లోకేష్‌ డిమాండ్‌ చేశారు. సోమవారం తిరుపతి ప్రెస్‌క్లబ్‌లో ఆయన మాట్లాడారు. తన వ్యాపారం నిమిత్తం గోవర్దన్‌బాబు నాయుడు వద్ద రూ.70 వేలు అప్పుగా తీసుకున్నాని, ఇందుకు తన వద్ద రూ.70 వేలకు బాండు, ఖాళీ చెక్‌ తీసుకున్నాడని తెలిపారు. 2017 నవంబర్‌ 15న రూ.17,200 అతని ఆంధ్రాబ్యాంక్‌ అకౌంట్‌లో డిపాజిట్‌ చేశానన్నారు. మిలిగిన సొమ్ము రూ.2,800 అతని చేతికి ఇచ్చానని తెలిపారు. ప్రతి నెలా రూ.6 వేలు వడ్డీ లెక్కన అతిని చేతికి చెల్లిస్తూ వచ్చానన్నారు. ఆపై అతినికి ఇవ్వాల్సిన రూ.50 వేలు 2018 ఫిబ్రవరి 3న తన ఐసీఐసీ అకౌంట్‌కు వేశానని. ఈ మొత్తం అతను డ్రా చేసుకున్నాడని తెలిపారు. అప్పు తీరిపోవడంతో తనకు బాండు ఇవ్వమని అడిగితే రెండు రోజుల తర్వాత ఇస్తానని చెప్పి దాట వేశాడని తెలిపారు. 

దీనిపై 2018 మార్చి 5న తిరుపతి అర్బన్‌ ఎస్పీకి ఫిర్యాదు చేసినట్లు వెల్లడించారు. అతనిపై పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారన్నారు. ఈ నేపథ్యంలో తనపై అతడు కక్షగట్టాడని వాపోయాడు.  అతడి వద్ద ఉన్న బాండును 2019 జూలై 7న పాకాల కోర్టులో తనపై కేసు వేశాడని తెలిపారు. ఇలా చాలా మందిపై కేసులు వేసి వారిని ఇబ్బంది పెడుతున్నట్లు ఆరోపించారు. అప్పు తీర్చినా కేసులు వేసి భయభ్రాంతులకు గురిచేయడం అతనికి అలవాటుగా మారిందన్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి అతనిపై చర్యలు తీసుకోవాలని కోరారు. సమావేశంలో బత్తల వినోద్‌కుమార్, హరిప్రసాద్, గిరియప్ప, త్యాగరాజుల నాయుడు, టి.నజీర్‌బాషా పాల్గొన్నారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top