సాంకేతిక విద్యకు రూ.10 కోట్లు మంజూరు | A grant of Rs 10 crore for technical education | Sakshi
Sakshi News home page

సాంకేతిక విద్యకు రూ.10 కోట్లు మంజూరు

Oct 20 2013 5:48 AM | Updated on Sep 1 2017 11:49 PM

నాణ్యమైన సాంకేతిక విద్యనందించేందుకు ప్రపంచ బ్యాంకు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో రూ. 10 కోట్లు మంజూరయ్యాయని కాకతీయ యూనివర్సిటీ రిజిస్ట్రార్ కె.సాయిలు తెలిపారు.

లక్ష్మీదేవిపల్లి, న్యూస్‌లైన్ : నాణ్యమైన సాంకేతిక విద్యనందించేందుకు ప్రపంచ బ్యాంకు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో రూ. 10 కోట్లు మంజూరయ్యాయని కాకతీయ యూనివర్సిటీ రిజిస్ట్రార్ కె.సాయిలు తెలిపారు.  కొత్తగూడెంలోని యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ (యూసీఈ) కళాశాలలో శనివారం నిర్వహించిన టెక్నికల్ ఎడ్యుకేషన్ క్వాలిటీ ఇంప్రూమెంట్ ప్రొగ్రామ్‌కు ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ  పంచవర్ష ప్రణాళికలో మంజూరు చే సిన నిధులతో నిరుపేద విద్యార్థులకు నాణ్యమైన విద్యనందించడమే ధ్యేయమన్నారు.
 
 ప్రపంచ స్థాయిలో విద్యార్థులను తీర్చిదిద్దడమే లక్ష్యమన్నారు. డిసెంబర్ 2014 నాటికి  రూ.10 కోట్లు ఖర్చులు చే యడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. ముఖ్యంగా మెంటరింగ్, కౌన్సెలింగ్, పేద విద్యార్థులకు మెరుగైన విద్యనందించడం, పీజీ, పీహెచ్‌డీ తదితర కార్యక్రమాలను చేపట్టనున్నామన్నారు.  ఈ నిధుల్లో మొదటి విడతగా రూ.2.25 కోట్లు విడుదలయ్యాయని చెప్పారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ కె.శౌరి, వైస్ ప్రిన్సిపాల్  జగన్‌మోహన్‌రాజు, టీఈక్యూఐపీ  కోఆర్డినేటర్ ఎం.మురళీధర్‌రెడ్డి, ఫైనాన్షియల్ మేనేజ్‌మెంట్ యూనిట్ హెడ్ ఎ.రవీందర్‌బాబు, ఎస్‌పీఎఫ్‌యూ హెడ్ ప్రొడ్యూస్‌మెంట్ అధికారి టి.ఎస్.మాణిక్య ప్రభు, కళాశాల సిబ్బంది శ్రీకాంత్, రాము, స్పందన్, రవి, తదితరులు పాల్గొన్నారు.
 
 కొత్త స్కీములకు రూ.100 కోట్ల ప్రతిపాదనలు
  నిరుపేద విద్యార్థులకు సాంకేతిక విద్యనందించేందుకు రెండు కొత్త స్కీములు ప్రవేశపెట్టేందుకు రూ. 100 కోట్ల ప్రతిపాదనలు పంపామని కేయూ రిజిస్ట్రార్ సాయిలు తెలిపారు. యూసీఈ కళాశాలలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సాంకేతిక విద్యా ప్రమాణాలను మెరుగు పర్చేందుకు  రాష్ట్రీయ ఉచిత శిక్షాభియాన్ (రూసా), నేషనల్ నాలెడ్జ్ కమిషన్ (ఎన్‌కేసీ) స్కీములకు నిధులు మంజూరు చేయాలని ఎన్‌కేసీ కమిషన్ చైర్మన్ శ్యాం గంగాధర్ పిట్రోడా కమిటీకి ప్రతిపాదనలు పంపామని చెప్పారు.  ఈ స్కీముల ద్వారా రాబోయే రోజుల్లో ఈక్వీటీ, యాక్సెస్, ఎక్స్‌లెన్స్ తదితర అంశాలతో సాంకేతిక విద్యలో ఉన్నత ప్రమాణాలను కలిగి ఉంటాయని తెలిపారు. అంతేకాకుండా మారుమూల ప్రాంతాల్లోని నిరుపేద విద్యార్థులకు సైతం అవకాశాలు కల్పించేందుకు  దోహదపడుతుందన్నారు. దేశంలో 1,500 విశ్వవిద్యాలయాలున్నాయని, వాటిని మరింత అభివృద్ధి పర్చేందుకు ప్రణాళికలను రూపొందిస్తున్నామని తెలిపారు.  

Advertisement
 
Advertisement
Advertisement