మరో నాలుగు రోజులు భగభగలు | Increased temperatures in Telangana | Sakshi
Sakshi News home page

మరో నాలుగు రోజులు భగభగలు

May 19 2026 6:17 AM | Updated on May 19 2026 6:17 AM

Increased temperatures in Telangana

ఎనిమిది జిల్లాల్లో తీవ్ర వడగాడ్పుల ప్రభావం 

రెడ్‌ అలర్ట్‌ జారీ చేసిన వాతావరణ శాఖ

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో ఎండలు భగ్గుమంటున్నాయి. గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 4 డిగ్రీల మేర అధికంగా నమోదవుతున్నాయి. మరో నాలుగు రోజులు రాష్ట్రంలో ఇదే తరహా వాతావరణం ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ముఖ్యంగా అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్న ఆదిలాబాద్, జగిత్యాల, ఆసిఫాబాద్, మంచిర్యాల, నల్లగొండ, పెద్దపల్లి, సిరిసిల్ల, నిజామాబాద్‌ జిల్లాల్లో తీవ్ర వడగాడ్పుల ప్రభావం ఉంటుందంటూ రెడ్‌ అలర్ట్‌ జారీ చేసింది. సోమవారం రాష్ట్రంలోకెల్లా నిజామాబాద్‌ జిల్లా కోటగిరిలో 45.6  డిగ్రీల సెల్సియస్‌ గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది.

మరోవైపు నైరుతి రుతుపవనాల కదలికలు చురుగ్గా కొనసాగుతున్నాయని.. సోమవారం ఆగ్నేయ అరేబియా సముద్రంలోని కొన్ని ప్రాంతాలు, నైరుతి, ఆగ్నేయ బంగాళాఖాతంలోని మరికొన్ని ప్రాంతాలు, అండమాన్‌ సముద్రంలోని చాలా ప్రాంతాలతోపాటు అండమాన్‌ నికోబార్‌ దీవుల్లోకి పూర్తిగా, మధ్య బంగాళాఖాతంలోని కొన్ని ప్రాంతాల్లోకి రుతుపవనాలు ప్రవేశించినట్లు వాతావరణ శాఖ తెలిపింది. అలాగే పశ్చిమ మధ్యప్రదేశ్‌ నుంచి మధ్య మహారాష్ట్ర, మరఠ్వాడ, ఉత్తర అంతర్గత కర్ణాటక మీదుగా దక్షిణ అంతర్గత కర్ణాటక వరకు ఉపరితల ద్రోణి ఏర్పడిందని తెలిపింది. అదేవిధంగా సోమవారం దక్షిణ కోస్తాంధ్ర తీర ప్రాంతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని పేర్కొంది.

Advertisement
 
Advertisement
Advertisement