జనవరిలో ఇచ్చిన తన తీర్పును తానే ప్రశ్నించిన సుప్రీం
నార్కో–టెర్రర్ కేసులో సయ్యద్ ఇఫ్తికార్కు బెయిల్ మంజూరు
న్యూఢిల్లీ: 2020 ఢిల్లీ అల్లర్ల కుట్ర కేసు నిందితులు ఉమర్ ఖలీద్, షర్జీల్ ఇమామ్లకు బెయిల్ నిరాకరిస్తూ జనవరిలో తానిచ్చిన తీర్పుపై సుప్రీంకోర్టు తానే అభ్యంతరం వ్యక్తం చేసింది. ‘బెయిల్ నియమం, జైలు మినహాయింపు’నియమం కేవలం వట్టి నినాదం కాదని జస్టిస్ బీవీ నాగరత్న, జస్టిస్ ఉజ్జల్ భూయాన్ల ధర్మాసనం పేర్కొంది. నార్కో–టెర్రర్ కేసులో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న జమ్మూకశ్మీర్లోని హంద్వారాకు చెందిన సయ్యద్ ఇఫ్తికార్ అంద్రాబీకి బెయిల్ మంజూరు చేస్తూ సోమవారం పైవిధంగా వ్యాఖ్యానించింది.
2020 ఢిల్లీ అల్లర్ల కుట్ర కేసు నిందితులు ఉమర్ ఖలీద్, షర్జీల్ ఇమామ్లకు జనవరి 5వ తేదీన జస్టిస్ అరవింద్ కుమార్, జస్టిస్ ఎన్వీ అంజారియాల సుప్రీం ధర్మాసనం బెయిల్ నిరాకరించింది. సాక్షుల విచారణ జరుగుతున్నందున ఏడాది తర్వాత మరోసారి బెయిల్ కోసం అప్పీల్ చేసుకోవాలని వారికి స్పష్టం చేసింది. అయితే, ఈ ఆదేశాలు 2021 నాటి కేఏ నజీబ్ కేసులో అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పునకు అనుగుణంగా లేవని సోమవారం జస్టిస్ ఉజ్జల్ భూయాన్ అభిప్రాయపడ్డారు.
అప్పటి తీర్పులో చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం(ఉపా)కింద నమోదైన కేసుల్లో విచారణలో జాప్యాన్ని బెయిలివ్వడానికి ఒక ప్రాతిపదికగా పేర్కొన్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఈ తీర్పునకు దేశంలోని అన్ని న్యాయస్థానాలు తప్పనిసరిగా కట్టుబడి ఉండాల్సిందేనని ఆయన స్పష్టం చేశారు. జాతీయ భద్రత, ఉగ్రవాద నేరాలకు సంబంధించిన, ఉపా చట్టాన్ని ఉద్దేశించిన కేసుల్లో ‘బెయిల్ నియమం..జైలు మినహాయింపు’అనే సూత్రాన్ని వర్తింపజేయాలని జస్టిస్ ఉజ్జల్ భూయాన్ అన్నారు.


