ఇదే మన బుల్లెట్‌ ట్రైన్‌ | Indian Railways reveals proposed bullet train design | Sakshi
Sakshi News home page

ఇదే మన బుల్లెట్‌ ట్రైన్‌

May 19 2026 5:07 AM | Updated on May 19 2026 5:07 AM

Indian Railways reveals proposed bullet train design

న్యూఢిల్లీ: భారతీయ రైలు పట్టాలపై బుల్లెట్‌ వేగంతో పరుగులుపెట్టే తొలి బుల్లెట్‌ రైలు ఫొటోను భారతీయ రైల్వే సోమవారం విడుదలచేసింది. ఢిల్లీలోని రైల్వే మంత్రిత్వశాఖ భవనం నాలుగో నంబర్‌ గేటు వద్ద ఈ బుల్లెట్‌ రైలు ఫొటోను ప్రముఖంగా కన్పించేలా ఏర్పాటుచేశారు. దేశంలో తొలి బుల్లెట్‌ రైలు సర్వీసులను ముంబై– అహ్మదాబాద్‌ మార్గంలో ప్రవేశపెట్టనున్న విషయం తెల్సిందే. రైలు డిజైన్‌ స్పష్టంగా తెలిసేలా భారీ ఫొటోను పెట్టారు. 

పక్షి నుంచి స్ఫూర్తిపొంది పక్షి ముఖాకృతిలో ఇంజిన్‌భాగాన్ని డిజైన్‌చేశారు. రైలు కిందివైపు తెలుపు రంగు, పై వైపు కాషాయరంగు, మధ్యలో నలుపురంగుతో డిజైన్‌ సిద్ధంచేశారు. ఈ రైలు అందుబాటులోకి వచ్చాక దేశంలోనే తొలి హైస్పీడ్‌ సర్వీస్‌గా చరిత్రకెక్కనుంది. వచ్చే ఏడాది ఆగస్ట్‌ 15కల్లా ప్రాజెక్ట్‌ను పూర్తిచేసి బుల్లెట్‌ రైలును ప్రజలకు చేరువచేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ రైలు అందుబాటులోకొస్తే ముంబై, అహ్మదాబాద్‌ నగరాల మధ్య ప్రయాణసమయం భారీగా తగ్గనుంది. 

ప్రస్తుతం ఈ నగరాల మధ్య ప్రయాణానికి ఏడు గంటల సమయం పడుతుండగా బుల్లెట్‌రైలులో కేవలం రెండు గంటల్లో చేరుకోవచ్చు. ముంబై తూర్పు సబర్బన్‌లోని విఖ్రోలీలో టన్నెల్‌ బోరింగ్‌ మెషీన్‌ను రంగంలోకి దింపామని ప్రకటించిన మరుసటిరోజే బుల్లెట్‌ రైలు అధికారిక ఫొటోను భారతీయ రైల్వే విడుదలచేయడం గమనార్హం. 350 టన్నుల బరువైన 13.6 మీటర్ల చుట్టుకొలత ఉన్న టన్నెల్‌బోరింగ్‌ మెషీన్‌(టీబీఎం) కట్టర్‌హెడ్‌తో పనిపూర్తవుతుండటంతో సొరంగ మార్గంలో ప్రధాన షీల్డింగ్‌ పనులు వేగంగా పూర్తికానున్నాయని నేషనల్‌ హైస్పీడ్‌ రైల్‌ కార్పొరేషన్‌    లిమిటెడ్‌ సోమవారం ప్రకటించింది. 
 

Advertisement
 
Advertisement
Advertisement