వాషింగ్టన్: శాంతి ఒప్పందం కుదుర్చుకునేందుకు మొండికేస్తున్న ఇరాన్ను ఎలాగైనా దారికి తెచ్చేందుకు ఆ దేశంపై దాడి చేద్దామని నిర్ణయించుకున్నామని, అయితే చివరినిమిషంలో ఆ ప్రణాళికను పక్కనపెట్టేశానని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వెల్లడించారు. మంగళవారం దాడిచేయాలని భావించామని సోమవారం అర్ధరాత్రి ప్రకటించిన ట్రంప్ తన నిర్ణయాన్ని ఎందుకు మార్చుకోవాల్సి వచి్చందో వివరించారు. మంగళవారం శ్వేతసౌధం ప్రాంగణంలో మీడియాతో మాట్లాడారు.
‘‘జనం ఆశ్చర్యపోయినా, ఆశ్చర్యపడకపోయినా నాకు అనవసరం. శత్రుదేశం అణ్వాయుధాలను చేజిక్కించుకుని నా కళ్లముందే ప్రపంచం బద్ధలుకాకముందే తేరుకోవాలని నిర్ణయించుకున్నా. అందుకే ఇరాన్పై దాడిచేయాలని ప్రణాళిక సిద్ధంచేశా. గంటలో దాడి చేద్దామనుకునేలోపే గల్ఫ్ దేశాల నుంచి నాకు ఫోన్కాల్స్ వచ్చాయి. ఖతర్ అమీర్ తమీమ్ బిన్ హమాద్ అల్ థానీ, సౌదీ యువరాజు మొహమ్మద్ బిన్ సల్మాన్ అల్ సాద్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ) అధ్యక్షుడు మొహమ్మద్ బిన్ జయేద్ అల్ నహ్యాన్తోపాటు కువైట్, బహ్రెయిన్ నుంచీ నాకు ఫోన్కాల్స్ వచ్చాయి.
దాడి నిర్ణయాన్ని విరమించుకోవాలని వాళ్లు సూచించారు. ఇరాన్తో చర్చలు సీరియస్గా జరుగుతున్న ఈ సమయంలో దాడులు సముచితం కాదు అని వాళ్లు అభిప్రాయపడ్డారు. దీంతో దాడి చేయలేదు. ఇరాన్కు అణ్వాయుధం దక్కకూడదనే షరతుతోనే శాంతి ఒప్పందం కుదరాలి. అలా జరగని పక్షంలో తక్షణం దాడి చేయాలని జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ జనరల్ డేనియల్ కేన్, సైన్యం, రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్కు సూచించా’’అని చెప్పారు.


