అగ్రరాజ్యం అమెరికా మరోసారి కాల్పుల మోతతో ఉలిక్కిపడింది. కాలిఫోర్నియాలోని శాన్ డియాగో ఇస్లామిక్ సెంటర్ (మసీదు) వెలుపల సోమవారం మధ్యాహ్నం ఇద్దరు దుండగులు విచక్షణా రహితంగా కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఒక సెక్యూరిటీ గార్డుతో సహా ముగ్గురు వ్యక్తులు ప్రాణాలు విడిచారు.
ఈ ఘటనను పోలీసులు ద్వేష పూరిత దాడిగా అనుమానిస్తున్నారు. అయితే ఈ ఘటనా స్థలానికి సమీపంలోని వీధిలో పార్క్ చేసి ఉన్న ఒక కారులో 17, 19 ఏళ్ల వయస్సు ఉన్న ఇద్దరు యువకుల మృతదేహాలను పోలీసులు గుర్తించారు. దాడి చేసిన అనంతరం నిందితులు ఇద్దరూ తమను తాము కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు స్థానిక మీడియాలో కథనాలు వస్తున్నాయి.
పోరాడిన సెక్యూరిటీ గార్డు
మరణించిన ముగ్గురిలో ఒకరైన సెక్యూరిటీ గార్డు.. సాయుధులైన దుండగులు లోపలికి చొరబడకుండా అతను తన ప్రాణాలను పణంగా పెట్టి అడ్డుకున్నాడు. ఆ సమయంలో మసీదు కాంప్లెక్స్ పరిధిలోని ‘అల్ రషీద్’ స్కూల్లో వందలాది మంది చిన్న పిల్లలు ఉన్నారు. ఒకవేళ అతడే గానీ అడ్డుపడకపోయింటే పెద్ద ఎత్తున రక్తపాతం జరిగి ఉండేది. ఈ ఘటన జరిగిన వెంటనే వందలాది మంది పోలీసులు అక్కడకు చేరుకున్నారు. అరబిక్, ఖురాన్ పాఠశాలలోని చిన్న పిల్లలను పోలీసులు సురక్షితంగా బయటకు తరలించారు.


