యశ్వంత్ కో-ఆపరేటివ్ బ్యాంక్ లైసెన్స్ రద్దు | RBI Action Against Yashwant CoOperative Bank What Depositors Must Know | Sakshi
Sakshi News home page

యశ్వంత్ కో-ఆపరేటివ్ బ్యాంక్ లైసెన్స్ రద్దు

May 20 2026 9:06 AM | Updated on May 20 2026 9:06 AM

RBI Action Against Yashwant CoOperative Bank What Depositors Must Know

మహారాష్ట్రకు చెందిన సహకార బ్యాంకింగ్ రంగంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. సామాన్య డిపాజిటర్ల ప్రయోజనాలే పరమావధిగా పనిచేసే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ), నిబంధనలు ఉల్లంఘించిన బ్యాంకులపై చర్యలు చేపడుతోంది. మహారాష్ట్ర, ఫాల్టాన్‌కు చెందిన ‘యశ్వంత్ కో-ఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్’ లైసెన్స్‌ను రద్దు చేస్తున్నట్లు ఆర్‌బీఐ అధికారిక ప్రకటన విడుదల చేసింది. మంగళవారం పని వేళలు ముగిసినప్పటి నుంచి ఈ బ్యాంక్ ఎలాంటి బ్యాంకింగ్ కార్యకలాపాలు (డిపాజిట్లు స్వీకరించడం, రుణాల చెల్లింపులు వంటివి) నిర్వహించకూడదని ఆర్‌బీఐ స్పష్టం చేసింది.

లైసెన్స్ రద్దుకు కారణాలు

బ్యాంకింగ్ రెగ్యులేషన్ చట్టం, 1949లోని కీలక నిబంధనలను పాటించడంలో యశ్వంత్ కో-ఆపరేటివ్ బ్యాంక్ పూర్తిగా విఫలమైందని ఆర్‌బీఐ పేర్కొంది. ఆర్‌బీఐ తెలిపిన వివరాల ప్రకారం.. బ్యాంక్ వద్ద ప్రస్తుతం ఉన్న ఆర్థిక వనరులు, సంపాదన సామర్థ్యం దాని ప్రస్తుత డిపాజిటర్లకు పూర్తి స్థాయిలో చెల్లింపులు చేయడానికి సరిపోవు. బ్యాంక్ భవిష్యత్తులో లాభాల్లోకి వచ్చే అవకాశాలు కనిపించడం లేదు. ఇలాంటి స్థితిలో ఈ బ్యాంకును ఇంకా కొనసాగనిస్తే అది సామాన్య డిపాజిటర్ల ప్రయోజనాలకు తీవ్ర విఘాతం కలిగిస్తుందని ఆర్‌బీఐ చెప్పింది.

తదుపరి చర్యలు

బ్యాంకును శాశ్వతంగా మూసివేయడానికి తగిన ఉత్తర్వులు జారీ చేయాలని, అలాగే బ్యాంకు ఆస్తుల అమ్మకం, బాధ్యతల నిర్వహణ కోసం ఒక సమర్థవంతమైన ‘లిక్విడేటర్’(ఒక సంస్థ పూర్తిగా నష్టాల్లో కూరుకుపోయి మూతపడే స్థితికి చేరినప్పుడు దాని లిక్విడేషన్ ప్రక్రియను నిర్వహించడానికి ప్రభుత్వం లేదా కోర్టు నియమించే ఒక అధికారిక వ్యక్తి)ను నియమించాలని మహారాష్ట్ర సహకార కమిషనర్, సహకార సంఘాల రిజిస్ట్రార్‌ను ఆర్‌బీఐ కోరింది.

డిపాజిటర్లకు లభించే రక్షణ ఎంత?

బ్యాంక్ లైసెన్స్ రద్దు అయినప్పటికీ డిపాజిటర్లు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆర్‌బీఐ భరోసా ఇచ్చింది. డిపాజిట్ ఇన్సూరెన్స్ అండ్ క్రెడిట్ గ్యారెంటీ కార్పొరేషన్ (డీఐసీజీసీ) చట్టం ప్రకారం ప్రతి డిపాజిటర్‌కు రక్షణ లభిస్తుంది. లిక్విడేషన్ ప్రక్రియ ప్రారంభమైన తర్వాత ప్రతి డిపాజిటర్ తన డిపాజిట్ మొత్తానికి గానూ గరిష్టంగా రూ.5,00,000 వరకు డిపాజిట్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ మొత్తాన్ని పొందేందుకు చట్టబద్ధమైన అర్హత కలిగి ఉంటారు. డీఐసీజీసీ ఇప్పటికే సంబంధిత డిపాజిటర్లకు రూ.106.96 కోట్ల మొత్తాన్ని ఇన్సూరెన్స్ ప్రొటెక్షన్ కింద చెల్లించడం గమనార్హం.

ఇటీవలి కాలంలో ఆర్థిక మూలాలు బలహీనంగా ఉన్న, నిబంధనలు పాటించని అర్బన్, రూరల్ కో-ఆపరేటివ్ బ్యాంకులపై ఆర్‌బీఐ కఠిన వైఖరి అవలంబిస్తోంది. యశ్వంత్ కో-ఆపరేటివ్ బ్యాంక్ లైసెన్స్ రద్దు కూడా ఇందులో భాగమే. అయితే, ఐదు లక్షల లోపు డిపాజిట్లు ఉన్న ఖాతాదారులకు పూర్తి డబ్బు వెనక్కి వస్తుండటం ఇక్కడ ఊరట కలిగించే అంశం.

ఇదీ చదవండి: అంకెల్లో పెరిగినా.. చేతిలో సున్నా!

Advertisement
 
Advertisement
Advertisement