ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్ మాతృ సంస్థ మెటా (Meta) త్వరలో, భారీ స్థాయిలో ఉద్యోగ కోతలు చేపట్టబోతోందని వచ్చిన సమాచారం.. టెక్ ప్రపంచంలో చర్చకు దారితీసింది. ఈసారి కంపెనీ సుమారు 10 శాతం మందిని తొలగించే అవకాశం ఉంది.
మెటా కంపెనీ సుమారు 8,000 మంది ఉద్యోగులను తొలగించనుంది. 2025 చివరి నాటికి సంస్థలో పనిచేసేవారి సంఖ్య సుమారు 78,000గా ఉండేది. దీన్నిబట్టి చూస్తే లేఆఫ్స్ ప్రభావం సుమారు 10 శాతం ఉద్యోగులపై పడుతుందని స్పష్టమవుతోంది. ఇదే సమయంలో కొత్త నియామకాలను కూడా నిలిపివేస్తున్నట్లు సమాచారం. దీనికి ప్రధాన కారణం.. ఖర్చులు తగ్గించడమే కాకుండా, కంపెనీని కొత్త దిశగా మలచడానికి తీసుకుంటున్న నిర్ణయాలు అని తెలుస్తోంది.
మెటా ఇప్పుడు తన సంస్థ నిర్మాణాన్ని పూర్తిగా మార్చుకోవడంలో భాగంగా.. పెద్ద పెద్ద టీమ్లకు బదులుగా చిన్న, వేగంగా పనిచేసే టీమ్లను ఏర్పాటు చేయాలని చూస్తోంది. కంపెనీ ఇప్పుడు పూర్తిగా ఏఐ కేంద్రంగా మారుతోంది. సంస్థ భవిష్యత్ పెట్టుబడుల్లో భారీ భాగాన్ని ఏఐ డేటా సెంటర్లు, చిప్లు, మోడల్ ట్రైనింగ్ వంటి రంగాల్లో పెట్టనున్నట్లు సమాచారం.
ఇదీ చదవండి: అమెరికాలో ఏఐపై పెరుగుతున్న వ్యతిరేకత!
కంపెనీ తీసుకుంటున్న నిర్ణయాల కారణంగా.. ఉద్యోగుల తొలగింపు మాత్రమే కాదు, 7000 మంది కొత్త ఏఐ ఆధారిత ప్రాజెక్ట్ల్లో పనిచేయాల్సి ఉంటుంది. ఈ మార్పులు ఉద్యోగుల్లో అసంతృప్తిని కూడా పెంచుతున్నాయి. దీంతో కంపెనీ అంతర్గత వాతావరణం కొంత ఒత్తిడిగా మారిందని నివేదికలు చెబుతున్నాయి. కొత్తగా ప్రవేశపెట్టిన కొన్ని AI టూల్స్ ఉద్యోగుల పనిని ట్రాక్ చేస్తాయన్న భయం కూడా ఉంది. కంపెనీ మాత్రం వాటిని కేవలం AI శిక్షణ కోసం మాత్రమే ఉపయోగిస్తున్నామని వివరణ ఇస్తోంది.


