anumula
-
ఆస్తి కోసం తల్లీకూతుళ్ల దారుణ హత్య
హాలియా: ఆస్తి కోసం తల్లీకూతుళ్లను దారుణంగా హత్య చేశారు. ఈ సంఘటన నల్లగొండ జిల్లా అనుముల మండలంలోని ఇబ్రహీంపేట గ్రామంలో ఆదివారం కలకలం రేపింది. స్థానికుల కథనం ప్రకారం ఇబ్రహీంపేటకు చెందిన రుద్రాక్షి సాయిలు, వెంకటమ్మ దంపతులకు ముగ్గురు కూతుళ్లు, ఒక కుమారుడు ఉన్నారు. కుమారుడు యాదయ్యకు సూర్యాపేట జిల్లా నారాయణగూడెం గ్రామానికి చెందిన సుమలతతో 20 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. యాదయ్య, సుమలత (40) దంపతులకు కుమార్తె రుద్రాక్షి లావణ్య (19) సంతానం. కుమార్తె పుట్టిన ఆరు నెలలకే తండ్రి యాదయ్య మృతి చెందాడు.దీంతో సుమలత తన కుమార్తె లావణ్యతో కలిసి వేరుగా నివాసం ఉంటోంది. కాగా, రుద్రాక్షి సాయిలు, యాదయ్యకి వారసత్వంగా వచ్చిన 6 ఎకరాల వ్యవసాయ భూమిని అతని కుమార్తె లావణ్య పేరుమీద రిజిస్టర్ చేసి గార్డియన్గా నానమ్మ వెంకటమ్మను పె ట్టారు. కొంతకా లం తరువాత వెంకటమ్మ తీవ్ర అనారోగ్యానికి గురైంది. కోడలు సుమలత అత్త గురించి పట్టించుకోకపోవడంతో వెంకటమ్మ ముగ్గురు కుమార్తెలు ఆమెను ఆస్పత్రిలో చూపించగా వైద్య ఖర్చుల నిమిత్తం సుమారు రూ.30 లక్షల వరకు ఖర్చు అయినట్లు తెలిసింది.ఈ క్రమంలో వెంకటమ్మను ఆమె కోడలు సుమలత, మనుమరాలు లావణ్య పట్టించుకోవడం లేదని వెంకటమ్మ ముగ్గురు కుమార్తెలు కోర్టులో పిటిషన్ వేశారు. గత ఏడాది లావణ్య మేజర్ అయినందున తాత సాయిలు లావణ్యకు చేసిన భూమి పట్టా విషయంలో తీర్పు అనుకూలంగా రావడంతో తమ తల్లి వెంకటమ్మకు ఆస్పత్రిలో వైద్యం కోసం ఖర్చు చేసిన రూ.30 లక్షలు ఇవ్వాలని ఆడబిడ్డలు వేసిన కేసుకు సంబంధించి రూ.5 లక్షలు ఇవ్వాలని కోర్టు రుద్రాక్షి సుమలతకు సూచించింది. సాయిలు, వెంకటమ్మ బాగోగుల విషయంలో పలుమార్లు ఆడబిడ్డలకు, సుమలతకు మధ్య తగాదాలు జరిగాయి.ఈ క్రమంలో ఆదివారం ఉదయం ఆస్తి విషయంలో ఆడపడుచులు.. సుమలత మరోమారు ఘర్షణ పడ్డారు. అనంతరం ఉదయం 9 గంటల సమయంలో సుమలత, ఆమె కూతురు లావణ్య గ్రామ శివారులోని ఆయిల్పామ్ తోట వద్దకు పని చేయడానికి వెళ్లారు. అక్కడే గుర్తు తెలియని వ్యక్తులు తల్లీకూతుళ్లపై విరుచుకుపడి కంట్లో కారం చల్లారు. లావణ్య మెడకు చున్నీ, సుమలత మెడకు పైటకొంగు చుట్టి ఊపిరాడకుండా చేసి హత్య చేసి అక్కడి నుంచి పారిపోయారు.ఘటనా స్థలాన్ని పరిశీలించిన డీఎస్పీ తల్లీకూతుళ్ల హత్య విషయం తెలుసుకున్న మిర్యాలగూడ డీఎస్పీ రాజశేఖరరాజు ఘటనాస్థలానికి వెళ్లి పరిశీలించారు. కుటుంబ సభ్యుల మధ్య కొంత కాలంగా జరుగుతున్న ఆస్తి తగాదాలే తల్లీకూతుళ్ల హత్యకు కారణమని ప్రాథమిక దర్యాప్తులో తేలిందని డీఎస్పీ తెలిపారు. ఇదిలా ఉండగా మృతురాలి తల్లి శాంతమ్మ తన కుమార్తె, తన మనుమరాలు హత్యకు ఆమె ఆడపడుచులు, వారి భర్తలే కారణమని ఆరోపించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ సాయి ప్రశాంత్ తెలిపారు. -
Telangana CM Revanth Reddy: తెలంగాణ సీఎంగా రేవంత్రెడ్డి.. ఎల్లుండే ప్రమాణం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా అనుముల రేవంత్రెడ్డి(54) ప్రమాణం చేయబోతున్నారు. సీఎల్పీ నేతగా రేవంత్ పేరును అధికారికంగా ప్రకటించింది కాంగ్రెస్ పార్టీ. మంగళవారం సాయంత్రం ఏఐసీసీ కార్యాలయంలో కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఈ నిర్ణయం వెల్లడించారు. ఒకవైపు ప్రకటన జరుగుతున్న సమయంలోనే.. రేవంత్రెడ్డి హుటాహుటిన ఢిల్లీకి బయల్దేరారు. మరోవైపు జూబ్లీహిల్స్లోని రేవంత్ ఇంటి వద్ద పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేశారు. ఎల్లుండి ఉదయం పదిన్నర గంటల ప్రాంతంలో తెలంగాణ కొత్త ముఖ్యమంత్రిగా రేవంత్ ప్రమాణం చేయనున్నారు. చివరికి రేవంత్ పేరే.. తెలంగాణ రాజ్భవన్ వద్ద నిన్నంతా హైడ్రామా నడిచింది. తెలంగాణ కొత్త ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం కోసం ఏర్పాట్లు కూడా జరిగాయి. అయితే.. నిన్న ఎమ్మెల్యేల అభిప్రాయ సేకరణ, ఇవాళ ఢిల్లీలో తెలంగాణ సీనియర్ల చర్చల పరిణామాల తర్వాత మంగళవారం సాయంత్రం ఈ నిర్ణయం వెల్లడించింది హైకమాండ్. పలువురు సీనియర్ల నుంచి అభ్యంతరాలు వ్యక్తం అయినప్పటికీ.. మెజార్టీ ఎమ్మెల్యేల అభిప్రాయం పరిగణనలోకి తీసుకున్న పార్టీ అధిష్టానం, చివరకు రేవంత్ పేరునే ఖరారు చేసింది. ‘‘కొత్త సీఎల్పీ నేత ఎంపికపై నిన్న భేటీ జరిగింది. అందులో మూడు తీర్మానాలు చేశారు. కాంగ్రెస్ విజయం అందించిన ప్రజలకు ధన్యవాదాలు తెలుపుతూ ఒక తీర్మానం. ప్రచారంలో పాల్గొన్న సీనియర్ నేతల కోసం మరో తీర్మానం. అలాగే తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్రెడ్డి పేరును ఖరారు చేస్తూ మరో తీర్మానం. అన్ని అంశాల్ని పరిగణనలోకి తీసుకున్నాకే ఈ ఎంపిక జరిగింది. పార్టీలో సీనియర్లందరికీ న్యాయం జరుగుతుంది. అంతా టీంగా పని చేస్తారు’’ అని మంగళవారం సాయంత్రం జరిగిన మీడియా సమావేశంలో కేసీ వేణుగోపాల్ వ్యాఖ్యానించారు. స్వతంత్రుడిగా అసెంబ్లీలోకి.. రాజకీయ అటుపోట్లు, ఒడిదుడుకులను ఎదుర్కొని సీఎం పదవి స్థాయికి ఎదిగిన రేవంత్ ప్రస్థానం ఆసక్తికరమే. విద్యార్థి దశలో ఏబీవీపీలో పని చేశారాయన. ఆ తర్వాత 2002లో బీఆర్ఎస్(అప్పుడు టీఆర్ఎస్)లో చేరి కొంతకాలం కొననసాగారు. ఆ తర్వాత 2006లో జడ్పీటీసీ మెంబర్గా స్వతంత్ర అభ్యర్థిగా విజయం సాధించి ప్రత్యక్ష రాజకీయాల్లో అడుగుపెట్టారు రేవంత్. సొంతూరైన కొండారెడ్డిపల్లి అచ్చంపేట నియోజకవర్గంలో ఉన్నా.. కల్వకుర్తి నియోజకవర్గంలోని మిడ్జిల్ మండలంలో అధికార కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ప్రతిపక్షాలను కూడగట్టి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి.. జడ్పీటీసీ సభ్యునిగా గెలుపొందడం విశేషం. అనంతరం 2007లో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కొడంగల్ నుంచి స్వతంత్ర అభ్యర్థిగా నెగ్గి శాసన మండలి సభ్యుడిగా అసెంబ్లీలో అడుగుపెట్టారు. మహబూబ్నగర్లో దాదాపు 100 ఓట్ల ఆధిక్యమున్న అధికార కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని రేవంత్ ఓడించడం గమనార్హం. ఆ తర్వాత టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడికి దగ్గరై.. 2009లో కొడంగల్ నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా 6వేలకు పైగా మెజార్టీతో నెగ్గి శాసనసభకి చేరారు . తిరిగి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత 2014 అసెంబ్లీ ఎన్నికల్లోనూ కొడంగల్ నుంచే పోటీ చేసి.. 14 వేల మెజార్టీతో మళ్లీ నెగ్గారు. ఆపై అసెంబ్లీలో ఆయన్ని ఫ్లోర్ లీడర్గా నియమించింది టీడీపీ. అయితే 2017 అక్టోబర్లో కాంగ్రెస్లో చేరతారనే ప్రచారం నడుమ.. ఆయన్ని ఆ పదవి నుంచి తప్పించగా, చివరకు 2017 అక్టోబర్ 31వ తేదీన ఆయన కాంగ్రెస్లో చేరారు. 2018 ఎన్నికల్లో కొడంగల్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి పట్నం నరేందర్రెడ్డి చేతిలో తొలి ఓటమి చవిచూశారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడినా.. 2019 సార్వత్రిక ఎన్నికల్లో మల్కాజ్గిరి లోక్సభ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి 10వేల ఓట్ల మెజార్టీతో గెలుపొందారాయన. దూకుడు స్వభావం ఉండడం, కేసీఆర్ ప్రభుత్వాన్ని నిలదీసే తత్వం ఆయనకు డైనమిక్ లీడర్ అనే గుర్తింపును జనాల్లో తెచ్చిపెట్టాయి. రేవంత్కు 2018 సెప్టెంబర్లో తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్కమిటీలో(ముగ్గురు సభ్యులుండే..) వర్కింగ్ ప్రెసిడెంట్ బాధ్యతల్ని, 2021 జులైలో ఏకంగా టీపీసీసీ చీఫ్ బాధ్యతలు అప్పజెప్పింది. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా కొడంగల్ నుంచి, కామారెడ్డి నుంచి పోటీ చేసి.. కొడంగల్లో మంచి మెజారిటీతో(32 వేల ఓట్ల) గెలుపొందగా, కామారెడ్డిలో మాత్రం ఓటమి పాలయ్యారు. వివాదాలున్నా.. కాంగ్రెస్ విజయ సారథిగా ఈ ఎన్నికలతో గుర్తింపు దక్కించుకున్న రేవంత్రెడ్డి పేరు సీఎం రేసులో ముందు నుంచే వినిపిస్తూ వచ్చింది. అయితే ఓటుకు నోటు లాంటి కేసు, పార్టీలో పలువురితో పొసగడకపోవడంతో పాటు లోక్సభ ఎన్నికల్లో మల్కాజ్గిరి నుంచి పెద్ద మెజార్టీతో గెలుపొందలేదనే కారణాలను చెప్పి కాంగ్రెస్ సీనియర్లు రేవంత్ ఎంపికకు అడ్డుపడ్డారు. అయినప్పటికీ రేవంత్రెడ్డి పేరునే ఎక్కువ మంది ఎమ్మెల్యేలు సమర్థించగా.. తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ను గెలుపు బాట పట్టించారని భావించిన అధిష్టానం సైతం ఆయన వైపే మొగ్గు చూపించింది. వ్యక్తిగత జీవితం.. రేవంత్రెడ్డి 1969, నవంబర్ 8వ తేదీన మహబూబ్నగర్ కొండారెడ్డి పల్లిలో జన్మించారు. తల్లిదండ్రులు నర్సింహారెడ్డి, రాంచంద్రమ్మ. వనపర్తిలో పాలిటెక్నిక్ చేశారు. ఉస్మానియా యూనివర్సిటీ ఏవీ కాలేజ్ నుంచి బీఏ చేశారాయన. జర్నలిస్ట్గానూ ఆయన ఓ వార్త పత్రికలో పని చేసినట్లు తెలుస్తోంది. అలాగే కొన్నాళ్లపాటు ప్రింటింగ్ ప్రెస్ కూడా నడిపారాయన. కాంగ్రెస్ సీనియర్ నేత జైపాల్రెడ్డి దగ్గరి బంధువైన గీతాను 1992లో రేవంత్రెడ్డి వివాహం చేసుకున్నారు. రేవంత్రెడ్డి-గీత దంపతులకు ఒక బిడ్డ నైమిషా రెడ్డి. ఈమె వివాహం 2015లో ఏపీకి చెందిన వ్యాపారవేత్త వెంకట్రెడ్డి తనయుడు సత్యనారాయణతో జరిగింది. ఈ జంటకు ఓ బాబు. మనవడు పుట్టిన సమయంలో తాత అయ్యాననే ఆనందంలో ఓ ఫొటో, అలాగే ఈ పంద్రాగష్టు రోజున మనవడితో దిగిన మరో ఫొటోను రేవంత్రెడ్డి తన సోషల్మీడియా ప్లాట్ఫామ్లో సంబురంగా షేర్ చేసుకున్నారు కూడా. I am happy to share with you all that we are blessed with the arrival of our grandson. My little girl Nymisha delivered a baby boy last week. I wish all your blessings for the baby and the mother. pic.twitter.com/DZOm1DHVtj — Revanth Reddy (@revanth_anumula) April 9, 2023 -
TPCC Chief Revanth Reddy: ఒడిదొడుకులను దాటి.. ముఖ్య నేతగా ఎదిగిన రేవంత్ అరుదైన ఫొటోలు
-
కెఫే నిలోఫర్ ప్రాసెసింగ్ ప్లాంట్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: నిలోఫర్ చాయ్.. బహుశా ఈ పేరు తెలియని హైదరాబాదీయులు ఉండరేమో. భాగ్యనగర వాసులే కాదు విదేశీయులు సైతం ఇక్కడి గరమ్ గరమ్ చాయ్ రుచి చూసినవారే. నాలుగు దశాబ్దాల నిలోఫర్ ప్రస్థానంలో ఇప్పటికే కోటి మందికిపైగా వినియోగదార్ల మనసు చూరగొంది. రెండవ తరం రాకతో సంస్థ విస్తరణ బాట పట్టింది. బేకరీ, కన్ఫెక్షనరీ ఉత్పత్తుల తయారీతో మొదలుకుని ప్రీమియం లాంజ్ల ఏర్పాటు, టీ పొడుల విక్రయంలోకి రంగ ప్రవేశం చేసింది. ప్రాసెసింగ్ ప్లాంట్ సైతం నెలకొల్పుతున్నట్టు కెఫే నిలోఫర్ బ్రాండ్ను ప్రమోట్ చేస్తున్న ఏబీఆర్ కెఫే అండ్ బేకర్స్ వ్యవస్థాపకులు అనుముల బాబురావు వెల్లడించారు. సాక్షి బిజినెస్ బ్యూరోకు ఇచ్చిన ఇంటర్వ్యూ విశేషాలు ఆయన మాటల్లోనే.. అత్యాధునిక యంత్రాలతో.. తయారీ కేంద్రం కోసం శంషాబాద్ దగ్గరలో తెలంగాణ ప్రభుత్వం ఆరు ఎకరాలను కేటాయించింది. 1,00,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో రోజుకు 30 టన్నుల ఉత్పత్తి సామర్థ్యంతో ఇది రానుంది. విదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో వస్తున్న ఈ అత్యాధునిక ప్లాంటుకు రూ.30 కోట్లు పెట్టుబడి చేస్తున్నాం. ఇక్కడ టీ పొడుల ప్రాసెసింగ్ యూనిట్ ఏడాదిలో, డ్రై కేక్స్, బిస్కట్స్ తయారీ కోసం బేకరీ ప్రాసెసింగ్ యూనిట్ æ2023లో అందుబాటులోకి వస్తుంది. ప్రత్యక్షంగా, పరోక్షంగా 600 మందికి ఉపాధి లభిస్తుంది. ఈ ఏడాదే నాల్గవ కేంద్రం.. హిమాయత్నగర్లో ప్రీమియం లాంజ్ను డిసెంబరులో ప్రారంభించనున్నాం. 16,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఇది రానుంది. ఒకేసారి 250 మంది వినియోగదార్లకు సేవలు అందించే వీలుంది. ఈ సెంటర్కు 150 మందిని నియమిస్తాం. బంజారాహిల్స్లో ఉన్న ప్రీమియం లాంజ్ 2019లో ప్రారంభమైంది. లక్డీకాపూల్లో తొలి కెఫేకు సమీపంలోనే రెండవ కేంద్రాన్ని 2016లో ఏర్పాటు చేశాం. మా కెఫేలకు రోజుకు 20,000 మంది కస్టమర్లు వస్తుంటారు. రెండేళ్లలో తెలంగాణలో.. టీ పొడులను మూడు రకాల రుచుల్లో పరిచయం చేశాం. రెండేళ్లలో తెలంగాణ వ్యాప్తంగా ఇవి లభిస్తాయి. రూ.10 మొదలుకుని రూ.650ల ప్యాక్ వరకు తీసుకొచ్చాం. సంస్థ ఆదాయంలో ఆన్లైన్ వాటా 20 శాతం ఉంది. ఆన్లైన్లో బుక్ చేస్తే చాయ్ సైతం ప్రత్యేక బాక్స్ ద్వారా హైదరాబాద్లో డెలివరీ చేస్తున్నాం. 300ల రకాల బేకరీ, కన్ఫెక్షనరీ ఉత్పత్తులను విక్రయిస్తున్నాం. సంస్థలో 250 మంది ఉద్యోగులున్నారు. -
జానారెడ్డి స్వగ్రామంలో ఉద్రిక్తత: నోముల భగత్కు నో ఎంట్రీ
నాగార్జున సాగర్: ఉప ఎన్నిక సందర్భంగా ప్రచారం చేసేందుకు నాగార్జున సాగర్ నియోజకవర్గ పరిధిలోని అనుముల గ్రామానికి టీఆర్ఎస్ అభ్యర్థి నోముల భగత్ చేరుకునేసరికి ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. టీఆర్ఎస్ నాయకులు రావొద్దంటూ కాంగ్రెస్ శ్రేణులు మంగళవారం ఆందోళన చేపట్టాయి. అనుముల గ్రామానికి టీఆర్ఎస్ ప్రచారానికి వస్తుండగా అదే గ్రామానికి చెందిన కాంగ్రెస్ నాయకుడు కారులో హాలియా వైపు వెళ్తుండగా జై తెలంగాణ అంటూ కారు వద్ద నినాదాలు చేశాడు. దీంతో ఇబ్బందికి గురిచేసిన టీఆర్ఎస్ కార్యకర్తలపై కాంగ్రెస్ వ్యక్తం చేసింది. తమ నాయకుణ్ణి ఇబ్బందులకు గురిచేసిన విషయం తెలుసుకున్న కాంగ్రెస్ శ్రేణులు టీఆర్ఎస్ నాయకులు అనుముల గ్రామానికి రాకుండా అడ్డుకున్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్, టీఆర్ఎస్ కార్యకర్తల మధ్య మాటల యుద్ధం జరిగింది. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు రంగ ప్రవేశం చేశారు. ఈ క్రమంలో పోలీసులతో మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జానారెడ్డి తనయుడు జయవీర్ రెడ్డి వాగ్వాదానికి దిగాడు. జీపు టాప్పైకి ఎక్కి టీఆర్ఎస్, ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేశాడు. ఈ సందర్భంగా అక్కడ ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. పోలీసులు ఇరుపక్షాలకు సర్దిచెబుతున్నారు. అనుముల గ్రామం జానారెడ్డి సొంతగ్రామం కావడంతో టీఆర్ఎస్కు ప్రవేశం నిషేధించారు. కాగా టీఆర్ఎస్ నాయకులు సీఎం కేసీఆర్ బహిరంగ సభ సందర్భంగా విస్తృత ప్రచారం చేస్తూ అనుముల గ్రామానికి వచ్చారు. -
టీఆర్ఎస్ గ్రేటర్ ప్రధానకార్యదర్శిగా అనుముల
సాక్షి, హైదరాబాద్: టీఆర్ఎస్ గ్రేటర్ హైదరాబాద్ ప్రధాన కార్యదర్శిగా అనుముల నర్సింహ్మారెడ్డిని నియమితులయ్యారు. ఈ మేరకు సిరిసిల్ల ఎమ్మెల్యే కె.తారక రామారావు, నగర అధ్యక్షులు కట్టెల శ్రీనివాస్ యాదవ్ నియామక పత్రాన్ని మంగళవారం ఆయనకు అందించారు. ఉప్పల్ నియోజకవర్గంలోని కుషాయిగూడకు చెందిన అనుముల పార్టీ రంగారెడ్డి జిల్లా యువజన విభాగంలోనూ, కాప్రా సర్కిల్ పార్టీలో వివిధ స్థాయిల్లో పనిచేశారు. కుషాయిగూడ బస్ డిపో కార్మిక సంఘానికి గౌరవ అధ్యక్షునిగా కూడా పనిచేశారు. పార్టీ పటిష్టత కోసం అనుముల చేసిన కృషికి గుర్తింపుగా పార్టీ గ్రేటర్ హైదరాబాద్ ప్రధానకార్యదర్శిగా నియమించినట్టుగా ఎమ్మెల్యే కె.తారక రామారావు చెప్పారు. కార్యక్రమంలో టీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షులు బాల్క సుమన్, పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి భేతి సుభాష్ రెడ్డి, పార్టీ నియోజకవర్గ నాయకులు మురళీ పంతులు, కనకరాజు పాల్గొన్నారు.


