14 నెలల పాటు పాకిస్తాన్ చెరలో మగ్గిన ఆంధ్రా జాలర్లు భారత్కు చేరుకున్నారు.వాఘా సరిహద్దు వద్ద పాకిస్తాన్ రేంజర్లు 20 మంది మత్స్యకారులను బీఎస్ఎఫ్కు అప్పగించారు. మంత్రి మోపిదేవి వెంకటరమణ మత్స్యకారులకు స్వాగతం పలికారు. పొట్టకూటి కోసం గుజరాత్ వలస వెళ్ళిన ఆంధ్రా జాలర్లు 2018 డిసెంబర్లో పొరపాటున గుజరాత్ తీరం వద్ద పాకిస్తాన్ జలాల్లోకి ప్రవేశించడంతో పాకిస్తాన్ అరెస్ట్ చేసింది. పాదయాత్రలో ఉన్న వైఎస్ జగన్ దృష్టికి ఈ విషయాన్ని వైఎస్సార్సీపీ నేతలు, బాధితులు తీసుకొచ్చారు. తక్షణమే విడుదలకు కృషి చేయాల్సిందిగా వైఎస్ జగన్.. ఎంపీ విజయసాయిరెడ్డికి ఆదేశాలిచ్చారు. అప్పటి నుంచి విదేశాంగ శాఖపై ఎంపీ విజయసాయిరెడ్డి ఒత్తిడి తీసుకొచ్చారు. ఆంధ్ర జాలర్లను విడిచిపెట్టాలని కేంద్ర విదేశాంగ శాఖ మంత్రికి పలుమార్లు ఆయన లేఖలు రాశారు. విజయసాయి రెడ్డి లేఖతో కేంద్ర విదేశాంగ శాఖ రంగంలోకి దిగింది. పాకిస్తాన్తో చర్చలు జరిపి ఆంధ్రా జాలర్లను విడిపించేందుకు చర్యలు తీసుకుంది.