తెలంగాణపై కేబినెట్‌ నోట్‌ రెడీ: షిండే | Telangana note ready says Sushil kumar shinde | Sakshi
Sakshi News home page

Sep 19 2013 3:55 PM | Updated on Mar 21 2024 9:10 AM

తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటుపై కేంద్ర మంత్రి మండలి నోట్‌ సిద్ధమైందని కేంద్ర హోం మంత్రి సుశీల్ కుమార్ షిండే చెప్పారు. ఆ నోట్ను ఈ రోజు పరిశీలిస్తామన్నారు. హైదరాబాద్‌ గురించి ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని షిండే చెప్పారు. ఈ రోజు సాయంత్రం జరగవలసిన కేంద్ర మంత్రి మండలి సమావేశం రేపటికి వాయిదా పడిన విషయం తెలిసిందే. ముఖ్యమైన కేంద్ర మంత్రులు కొందరు అందుబాటులో లేకపోవడం వల్ల ఈ సమావేశం రేపటికి వాయిదాపడింది. మంత్రి మండలి సమావేశం ఎజెండాలో తెలంగాణ అంశం లేదని తెలుస్తోంది. ఈ నోట్ను రేపు జరిగే మంత్రి మండలి సమావేశంలో పరిశీలనకు వస్తుందో, రాదో స్పష్టంగా తెలియడంలేదు. రాష్ట్ర విభజన ప్రకటన వెలువడిన తరువాత ప్రధానంగా హైదరాబాద్పైనే చర్చ జరుగుతోంది. మిగిలిన విషయాలు ఎలా ఉన్నా ఒక్క హైదరాబాద్ విషయంలోనే పీటముడి పడింది. ఆరు దశాబ్దాలుగా రాజధానిగా ఉన్న హైదరాబాద్‌పై హక్కులు ఎవరివనేది మిలియన్‌ డాలర్ల ప్రశ్నగా మిగిలింది. ఈ నేపధ్యంలో హైదరాబాద్‌ గురించి ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని షిండే చెబుతున్నారు. హైదరాబాద్ విషయం తేలకుండా విభజన అంశం తేలడం కష్టం.

Advertisement
 
Advertisement
Advertisement