సీమాంధ్రుల భద్రతే కీలకాంశం | Task force to study security scenario for seemandhra people | Sakshi
Sakshi News home page

Oct 30 2013 7:06 AM | Updated on Mar 21 2024 6:35 PM

తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడితే ‘ఉమ్మడి రాజధాని హైదరాబాద్‌లో సీమాంధ్రుల భద్రత’ ప్రత్యేక టాస్క్‌ఫోర్స్ సమావేశాల్లో కీలకాంశం కానుంది. హైదరాబాద్‌లో సీమాంధ్రుల భద్రతకు ప్రత్యేక చట్టం, హైదరాబాద్ పోలీస్ కమిషనర్ ఏ గవర్నర్ పరిధిలో పనిచేయాలి అనే అంశాలను ప్రత్యేక టాస్క్‌ఫోర్స్ సమావేశంలో చర్చించనున్నారు. ఈ నెల 31వ తేదీన జరిగే సమావేశంలో ఈ అంశంపై చర్చించేందుకు వీలుగా ఆహ్వానితులందరికీ ఇప్పటికే ఎజెండా అందజేసినట్లు సమాచారం. విభజన నేపథ్యంలో శాంతిభద్రతలకు సంబంధించిన సమస్యల పరిష్కారానికి కేంద్ర హోంశాఖ సలహాదారు కె.విజయ్‌కుమార్ నేతృత్వంలో కేంద్రం ఏర్పాటు చేసిన ప్రత్యేక టాస్క్‌ఫోర్స్ కమిటీ తొలి భేటీ మంగళవారం జరిగింది. స్థానిక మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థలో జరిగిన సమావేశానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలో పనిచేసే సీనియర్ ఐపీఎస్, ఐఏఎస్, రిటైర్డు ఉన్నతాధికారులు పలువురు హాజరయ్యారు. మాజీ డీజీపీలు ఏకే మహంతి, హెచ్‌జే దొర హాజరుకాలేదు. రిటైర్డు సీనియర్ పోలీసు అధికారి ఆంజనేయరెడ్డికి ఆహ్వానం ఉన్నప్పటికీ ఆయన రాలేదు. విశాలాంధ్రప్రదేశ్‌కు తాను కట్టుబడి ఉన్నానని, రాష్ట్ర విభజన ప్రక్రియలో తాను భాగస్వామిని కాలేనని ఆయన మీడియాతో చెప్పారు. బుధవారం కూడా యథావిధిగా సమావేశం జరగనుండగా ఈ రెండోరోజు సమావేశానికి పోలీసుశాఖకు సంబంధించిన అన్ని విభాగాల చీఫ్‌లు హాజరుకావాలని కమిటీ కోరింది. సీఐడీ, ఏపీఎస్పీ, ఆర్ముడ్ రిజర్వు, ఎస్పీఎఫ్ తదితర విభాగాల ఉన్నతాధికారులు పాల్గొననున్నారు. ఇక మూడోరోజు సమావేశంలో హైదరాబాద్‌లో శాంతిభద్రతల పరిస్థితి, సీమాంధ్రుల భద్రత కోసం తీసుకోవాల్సిన చర్యలపై పోలీసు ఉన్నతాధికారులు తమ అభిప్రాయాలు చెప్పడంతో పాటు నివేదికలు అందించనున్నారు. ఉగ్రవాద, తీవ్రవాద సమస్యలు, నివారణ కోసం తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్తలపై కూడా చర్చించనున్నారు. మావోయిస్టుల సమస్యకు సంబంధించి స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ (ఎస్‌ఐబీ), గ్రేహౌండ్స్, ఉగ్రవాదుల సమస్యకు సంబంధించి ఆక్టోపస్, కౌంటర్ ఇంటెలిజెన్స్ అధికారులు నివేదిక సమర్పించనున్నారు. మంగళవారం నాటి భేటీలో విభజన అనంతరం ఇద్దరు డీజీపీల కార్యాలయాలను హైదరాబాద్‌లో ఎక్కడెక్కడ ఏర్పాటుచేయాలనే అంశంపై టాస్క్‌ఫోర్స్ కమిటీ ఐపీఎస్ అధికారుల నుంచి ప్రతిపాదనలు కోరింది. అలాగే రెండు రాష్ట్రాల్లో పోలీసు శాఖను పటిష్టం చేయడంపైనా దృష్టి పెట్టింది. ఆంధ్రప్రదేశ్ డీజీపీ ప్రధాన కార్యాలయం హైదరాబాద్‌లోనే ఉన్నా ఆపరేషనల్ కార్యాలయం మాత్రం సీమాంధ్రలో ఏర్పాటుచేసే అవకాశం ఉందని పోలీసు ఉన్నతాధికారి ఒకరు వివరించారు. హైదరాబాద్‌లో శాంతిభద్రతలకు సంబంధించిన అంశంపై నగర పోలీస్ కమిషనర్ అనురాగ్‌శర్మ కూడా టాస్క్‌ఫోర్స్‌కు నివేదిక అందించనున్నారు. పోలీసుశాఖ ఆస్తుల పంపిణీపై చర్చ రాష్ట్ర విభజన అనంతరం రెండు రాష్ట్రాలకు సంబంధించి పోలీసుశాఖ ఆస్తుల పంపిణీ అనే అంశంపైనే టాస్క్‌ఫోర్స్ మొదటిరోజు సమావేశంలో ప్రధానంగా చర్చించినట్లు విజయ్‌కుమార్ మీడియాకు తెలిపారు. ఏయే రాష్ట్రాలకు ఎంత సిబ్బందిని కేటాయించాలనే అంశాలపై కూడా దృష్టి సారించామన్నారు. మూడురోజుల పాటు సమావేశాల అనంతరం కేంద్ర హోం మంత్రిత్వశాఖకు నివేదిక అందించనున్నట్లు తెలిపారు. పోలీసుశాఖ నియామకాలకు సంబంధించి ఇప్పటికే జోనల్ వ్యవస్థ ఉన్నందున సిబ్బంది పంపిణీ పెద్ద సమస్య కాబోదని టాస్క్‌ఫోర్స్ సమావేశంలో పాల్గొన్న అదనపు డీజీ స్థాయి అధికారి ఒకరు వివరించారు. అయితే హైదరాబాద్ ఫ్రీజోన్‌గా గతంలో కొన్ని నియామకాలు జరిగాయని, వీటిపై చర్చించాల్సి ఉందన్నారు. గవర్నర్, సీఎంలతో టాస్క్‌ఫోర్స్ బృందం భేటీ విజయ్‌కుమార్ నేతృత్వంలోని టాస్క్‌ఫోర్స్ కమిటీ మంగళవారం సాయంత్రం రాజ్‌భవన్‌లో గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్‌తో భేటీ అయ్యింది. విభజనకు సంబంధించిన అంశాలపై అధికారులు ఆయనతో చర్చించారు. తర్వాత క్యాంపు కార్యాలయంలో సీఎం కిరణ్‌ను కలిశారు. విభజనపై సీనియర్ ఉన్నధికారుల అభిప్రాయాలు స్వీకరిస్తున్నట్లు విజయ్‌కుమార్ వారికి వివరించినట్లు సమాచారం. టాస్క్‌ఫోర్స్ కమిటీకి ఐఏఎస్, ఐపీఎస్‌లు నివేదికలు ఇవ్వొచ్చు సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఏర్పాటు, తద్వారా వచ్చే సమస్యలు, శాంతి భద్రతల వంటి అంశాలపై ఐఏఎస్‌లు, ఐపిఎస్‌లు తమ అభిప్రాయాలను కేంద్రం ఏర్పాటు చేసిన టాస్క్‌ఫోర్స్ కమిటీకి నివేదించవచ్చు. విజయ్‌కుమార్ నేతృత్వంలోని టాస్క్‌ఫోర్స్ కమిటీ బుధ, గురువారాలు నగరంలోనే ఉంటుంది. ఈ రెండు రోజుల్లో ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లు వ్యక్తిగతంగా కానీ, బృందాలుగా కాని తమ అభిప్రాయాలను ఈ కమిటీకి వివరించవచ్చు. అలాగే ఆయా రంగాల్లో నిపుణులైన ఐఏఎస్,ఐపీఎస్‌లు ప్రత్యేక నివేదికలను కూడా ఈ కమిటీకి అందజేయవచ్చు. అయితే సాధారణ పౌరులు ఈ టాస్క్‌ఫోర్స్ కమిటీని కలుసుకునే అవకాశం లేదు. టాస్క్‌ఫోర్స్ భేటీకి హాజరైన అధికారులు.. కె.విజయ్‌కుమార్, కేంద్ర హోంశాఖ సలహాదారు రాజీవ్ శర్మ, కేంద్ర హోంశాఖ అదనపు కార్యదర్శి శంతన్, కేంద్ర హోంశాఖ అజయ్‌మిశ్రా, ఉన్నత విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ఎన్.ఆర్.వాసన్, ఎన్‌ఐఏ స్పెషల్ డెరైక్టర్ కె.అరవిందరావు, మాజీ డీజీపీ డి.ఎన్.మిత్రా, మధ్యప్రదేశ్ అదనపు డీజీ సంతోష్ మెహ్రా ఐపీఎస్, బీఎస్‌ఎఫ్ జె.వి.రాముడు, డీజీ ఆపరేషన్స్ ఎం.మహేందర్‌రెడ్డి, రాష్ట్ర ఇంటెలిజెన్స్ చీఫ్ ఎ.కె.ఖాన్, ఆర్టీసీ ఎండీ అనురాగ్‌శర్మ, హైదరాబాద్ పోలీస్ కమిషనర్ ఎం.మాలకొండయ్య, పోలీసు అకాడమీ డెరైక్టర్ కుమార్ విశ్వజిత్, ఏసీబీ డెరైక్టర్ వి.సి.సజ్జనార్, ఎస్‌ఐబీ చీఫ్ మల్లారెడ్డి, హైదరాబాద్ జాయింట్ సీపీ, స్పెషల్ బ్రాంచ్ ఈతముక్కల దామోదర్ ఐపీఎస్ చారుసిన్హా, ఏపీపీఎస్సీ కార్యదర్శి

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement