రెండు ప్రభుత్వాలకు ఆర్బిఐ లేఖ | rbi-letter-to-ap-and-telangana | Sakshi
Sakshi News home page

Jul 16 2014 8:30 PM | Updated on Mar 22 2024 11:06 AM

రీషెడ్యూల్‌ ప్రతిపాదనపై వివరాలు కోరుతూ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాలకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) లేఖ రాసింది. రైతుల రుణాల రీ షెడ్యూల్‌కు ఆర్‌బిఐ అంగీకరించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే మాఫీ చేసిన రుణాలను మూడేళ్లలో చెల్లించగలరా? అని రెండు ప్రభుత్వాలను ఆర్‌బిఐ ప్రశ్నించింది. రుణాల రీషెడ్యూల్ విధి విధానాలపై నివేదిక పంపాలని రెండు ప్రభుత్వాలను కోరింది. ఎన్నికల ముందు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు రైతు రుణాలు మాఫీ చేస్తామని హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే రుణాలు మాఫీ చేయడానికి రెండు రాష్ట్రాలకు అనేక అడ్డంకులు ఏర్పడ్డాయి. తెలంగాణలో ఆర్థిక పరమైన ఇబ్బందులు పెద్దగా లేకపోయినా, ఏపిలో మాత్రం చాలా క్లిష్టపరిస్థితులు ఉన్నాయి. ఏపి ఆర్థికంగా దయనీయ స్థితిలో ఉంది. జీతాలు ఇవ్వడానికి కూడా డబ్బులులేని పరిస్థితి ఏర్పడింది. హామీలు ఇచ్చి అధికార చేజిక్కించుకున్న చంద్రబాబు రుణాలు మాఫీ చేయలేక, కనీసం రీషెడ్యూల్ అన్నా చేయించాని తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఈ పరిస్థితులలో అనేక నిబంధనలతో ఆర్బిఐ నుంచి లేఖ వచ్చింది. మూడేళ్లలో రుణాలు చెల్లించేలా నిబంధనకు అంగీకరించాలని ఆర్బిఐ కోరింది. 2013-14 ఖరీఫ్‌కు మాత్రమే రుణాలు రీషెడ్యూల్‌ చేయగలమని ఆర్బిఐ సూత్రప్రాయంగా అంగీకారం తెలిపింది. అలాగే ఏపీలోని 572 మండలాల్లో 11,700 కోట్ల రూపాయల మేర పంట రుణాలు ఉన్నట్లు ఆర్బిఐ తేల్చింది. ఈ లేఖకు సమాదానం ఇవ్వడానికి ఏపి ప్రభుత్వం మల్లగుల్లాలు పడుతోంది. ఆర్థిక శాఖ అధికారులు సచివాలయంలో అత్యవసరంగా సమావేశమయ్యారు. బ్యాంకుల నుండి సమాచారం సేకరిస్తున్నారు. రుణ బకాయిల చెల్లింపు గడువును మరింత పెంచమని ఆర్బిఐని కోరాలని ఏపి ప్రభుత్వం నిర్ణయించింది. ఇదిలా ఉండగా, రైతుల రుణాల రీషెడ్యూల్‌ విషయంలో ఆర్బిఐ లేఖపై తెలంగాణ మంత్రి మండలి చర్చించింది. లేఖ ఆధారంగానే నిర్ణయం తీసుకోవాలని మంత్రి మండలి తీర్మానించింది.

Advertisement

Related Videos By Category

Advertisement
 
Advertisement
Advertisement