వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎంపి జగన్మోహన రెడ్డి వైఎస్ఆర్ జిల్లా ఇడుపులపాయ వెళ్లేందుకు నాంపల్లిలోని సిబిఐ ప్రత్యేక కోర్టు అనుమతి ఇచ్చింది. తన బెయిల్ షరతులను సడలించాలని, వచ్చే నెల 1, 2 తేదీలలో ఇడుపులపాయ, 4న గుంటూరు వెళ్లేందుకు అనుమతించాలని జగన్ దాఖలు చేసిన పిటిషన్ను కోర్టు ఈరోజు విచారించింది. జగన్ పిటిషన్పై సీబీఐ అభ్యంతరం వ్యక్తం చేసింది. సీబీఐ అధికారులు కౌంటర్ దాఖలు చేశారు. జగన్ బెయిల్పై ఆంక్షలు సడలించవద్దని కోరారు. సాక్షులంతా హైదరాబాద్ వెలుపలే ఉన్నారని, జగన్ పలుకుబడి ఉన్న వ్యక్తి అయినందున వారిని ప్రభావితం చేయవచ్చనని సిబిఐ న్యాయస్థానానికి తెలిపింది. ఈ కేసులో నిందితులు ఇంకా జైల్లోనే ఉన్నారని, వారి బెయిల్ పిటిషన్లు ఇంకా పెండింగ్లోనే ఉన్నాయని తెలిపింది. బెయిల్ షరతులు సడలిస్తే తమ ప్రక్రియకు విఘాతం కలుగుతుందని కౌంటర్ పిటిషన్లో వెల్లడించింది. సీబీఐ కౌంటర్ పిటిషన్పై జగన్ తరపు న్యాయవాది సుశీల్ కుమార్ కోర్టులో వాదనలు వినిపించారు. జగన్పై ఉన్నది హైలీ టెక్నికల్ కేసు అని, సాక్ష్యాలు తారుమారు చేసే అవకాశం లేదని, ప్రతి సాక్ష్యం డాక్యుమెంట్గా రికార్డు అయిందన్నారు. 70 మంది నిందితుల్లో 2౦ మందిని నిర్దోషులని సీబీఐ పేర్కొన్నట్లు వివరించారు. 9 కంపెనీల్లో క్విడ్ ప్రో కోనే లేదని సీబీఐ చెప్పిందన్నారు. కోర్టు కల్పించిన స్వేచ్చను తాము కోల్పోమని, ఎట్టి పరిస్థితుల్లోనూ షరతులు ఉల్లంఘించమని సుశీల్ కుమార్ న్యాయస్థానానికి విన్నవించారు. తండ్రి సమాధి వద్ద నివాళులు అర్పించడానికే జగన్ ఇడుపులపాయకు వెళ్లనున్నారని తెలిపారు. ఇడుపులపాయ నుంచి తిరిగి హైదరాబాద్ వస్తారని ఆ తర్వాత 4వ తేదీన గుంటూరు వెళ్తారని చెప్పారు. ఇరువర్గాల వాదనలు విన్న న్యాయస్థానం ఇడుపులపాయకు వెళ్లేందుకు జగన్కు అనుమతి ఇచ్చింది. కోర్టు అనుమతితో సుదీర్ఘ కాలం తరువాత జగన్ ఇడుపులపాయ వెళ్లనున్నారు. తన తండ్రి దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి సమాధివద్ద జగన్ నివాళులర్పించనున్నారు.