నల్లగొండ జిల్లా కట్టంగూర్ మండలం ఎర్రసానిగూడెం స్టేజీ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మాజీ ఎమ్మెల్యే కుమారుడు దుర్మరణం చెందారు. కొత్తగూడెం నుంచి హైదరాబాద్ వైపు వస్తున్న కారు ముందు వెళ్తున్న ఆయిల్ ట్యాంకర్ ను ఢీకొట్టింది. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న నలుగురిలో ఇద్దరు మృతిచెందగా..మరో ఇద్దరికి తీవ్రగాయాలు అయ్యాయి. వీరి పరిస్థితి విషమంగా ఉండడంతో నార్కట్ పల్లి కామినేని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ దుర్ఘటనలో నర్సంపేట మాజీ ఎమ్మెల్యే మద్దికాయల ఓంకార్ కుమారుడు విజయ్ కుమార్, ఆయన అత్తగారు అక్కడికక్కడే మృతి చెందారు. విజయ్ కుమార్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ప్రముఖ ప్రసూతితో వైద్యులుగా పని చేస్తున్నారు. ఈ ప్రమాదంలో ఆయన భార్యతో పాటు మరొకరికి తీవ్రగాయాలు అయ్యాయి. కాగా ప్రమాదం జరిగిన సమయంలో అటుగా వెళ్తున్న నకిరేకల్ ఎమ్మెల్యే వీరేశం ఘటనాస్థలికి చేరుకుని సహయక చర్యలు చేపట్టారు.