పులివెందుల : వైఎస్సార్ కడప జిల్లా పులివెందులలో ప్రముఖ కంటి వైద్యుడు, మాజీ ఎమ్మెల్యే దివంగత డాక్టర్ ఎస్.పురుషోత్తమరెడ్డి పెద్ద కుమారుడు డాక్టర్ ఎస్. విలియం సత్యానంద రెడ్డి (67) మంగళవారం ఉదయం కడపలో ఆకస్మికంగా గుండెపోటుతో మరణించారు. విలియం సత్యానంద రెడ్డి వైద్యవిద్యను ప్రతిష్టాత్మక వేలూరు సీఎంసీ వైద్య కళాశాలలో అభ్యసించి, ఎండీ కోర్సును కూడా పూర్తిచేసి, మదనపల్లె మిషనరీ హాస్పిటల్లో చాలా కాలం సేవలందించారు. కడప పట్టణంలో దీప నర్సింగ్ హోమ్ ఏర్పాటుచేసి ప్రముఖ వైద్య నిపుణుడిగా రోగులకు విశేషసేవలందించారు. ఆయన కుమార్తె దీప కడప పట్టణంలో ప్రముఖ స్పెషలిస్ట్ వైద్యురాలిగా సేవలందిస్తున్నారు.
మరో ప్రముఖ వైద్యుడు డాక్టర్ విలియం సత్యానందరెడ్డి మృతి చెందడంతో వైఎస్ కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. సత్యానందరెడ్డి భౌతికకాయాన్ని బుధవారం పులివెందులకు తీసుకొచ్చారు. పులివెందులలో దివంగత వైఎస్సార్ సతీమణి, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మాతృమూర్తి వైఎస్ విజయమ్మ, కడప ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి, ప్రముఖ పారిశ్రామికవేత్త వైఎస్ ప్రకాష్రెడ్డి, వైఎస్సార్సీపీ పులివెందుల నియోజకవర్గ ఇన్ఛార్జి వైఎస్ భాస్కర్రెడ్డి, వైఎస్ ప్రతాప్రెడ్డి, మున్సిపల్ ఇన్ఛార్జి వైఎస్ మనోహర్రెడ్డి, వైఎస్ జోసఫ్రెడ్డి, తదితరులతోపాటు వైఎస్ కుటుంబ సభ్యులు నివాళులర్పించారు. అనంతరం పులివెందుల లయోలా డిగ్రీ కాలేజీ రోడ్డులోని వైఎస్ సమాధుల తోటలో బుధవారం సాయంత్రం సత్యానందరెడ్డి అంత్యక్రియలు నిర్వహించారు. ఈ సందర్భంగా సత్యానందరెడ్డి డాక్టర్గా ప్రజలకు సేవలు అందించిన విషయాలను గుర్తుకు తెచ్చుకుని కుటుంబ సభ్యులతో ఆయన ఎంతో ప్రేమగా ఉండే విషయాలను తలుచుకుని బాధను వ్యక్తం చేశారు.


