వేంపల్లె : జాతీయ స్థాయి బ్యాడ్మింటన్ పోటీలలో వేంపల్లె ప్రభుత్వ డిగ్రీ కళాశాల పీడీ రాచవీటి తేజేంద్ర, బికాం ద్వితీయ సంవత్సర విద్యార్థి ఎ.హరి ప్రసాద్లు గోల్డ్ మెడల్స్ సాధించినట్లు ప్రిన్సిపల్ డాక్టర్ ఉషశ్రీ తెలిపారు. శనివారం కళాశాలలో జాతీయ విజేతలైన గురుశిష్యులను ఆమె ఘనంగా అభినందించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ మాట్లాడుతూ.. జమ్మూ కాశ్మీర్లో ఇండియా కౌన్సిల్ ఫర్ స్పోర్ట్స్ అండ్ ఎడ్యుకేషన్ ఆధ్వర్యంలో జరిగిన జాతీయ స్థాయి బ్యాడ్మింటన్ పోటీలలో సీనియర్ మెన్స్ డబుల్స్ విభాగంలో ఆంధ్రప్రదేశ్ తరపున ఆడి వీరు పసిడి పతకాలు సాధించారన్నారు. ఈ ఘనత సాధించిన తేజేంద్ర, హరిప్రసాద్లతో పాటు వారికి సహకరించిన అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు మురళి, మనోహర్ రెడ్డిలకు ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపల్ నాగేంద్ర, అధ్యాపకులు సతీష్, హజియా బేగం తదితరులు పాల్గొన్నారు.
పారా స్పోర్ట్స్ మీట్లో ప్రతిభ
కడప ఎడ్యుకేషన్:రాష్ట్ర స్థాయి పారా స్పోర్ట్స్ మీట్–2026లో కడప జిల్లా సమగ్ర శిక్ష – సహిత విద్య విభాగానికి చెందిన ప్రత్యేక అవసరాలు గల విద్యార్థులు అద్భుత ప్రతిభ కనబరిచి జిల్లాకు కీర్తి తెచ్చారు. ఎర్రగుంట్ల జెడ్పీ హైస్కూల్కు చెందిన చిన్న లోకేశ్వరెడ్డి 100 మీటర్ల రన్నింగ్లో బంగారు పతకం సాధించగా, బి.మఠం మండలానికి చెందిన అవినాష్ కుమార్ 400 మీటర్ల పరుగు, లాంగ్జంప్, 100 మీటర్ల పరుగులో మూడు కాంస్య పతకాలు గెలుచుకున్నాడు. సిద్ధవటం మండలానికి చెందిన బేజీ, మైదుకూరు మండలానికి చెందిన వీరభద్ర లాంగ్జంప్లో రజత పతకాలు కై వసం చేసుకున్నారు. ఈ పోటీలకు ఐఈఆర్పీ రవికుమార్, ఐఈడీఎస్ఎస్లు ఎస్కార్ట్లుగా వ్యవహరించి శిక్షణ ఇచ్చారు. ప్రతిభ చాటిన విద్యార్థులను సమగ్రశిక్ష ఏపీసీ అనురాధ, జిల్లా ఐఈ కో–ఆర్డినేటర్ వెంకటసుబ్బయ్య, అసిస్టెంట్ కో–ఆర్డినేటర్ రమణమూర్తి అభినందించారు.
ప్రమాద సంఘటనపై కేసు
మైదుకూరు : మైదుకూరు మండలం టి.కొత్తపల్లె వద్ద గురువారం జరిగిన రోడ్డు ప్రమాద సంఘటనపై కేసు నమోదు చేసినట్టు పోలీసులు శనివారం తెలిపారు. తిప్పిరెడ్డిపల్లెకు చెందిన కశెట్టి సుబ్బరాయుడు తన మనవడు యాపరాల శివతో కలిసి మోటార్ బైక్పై వెళుతూ రోడ్డు ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. ఈ సంఘటనపై సుబ్బరాయుడు అల్లుడు యాపరాల సుబ్బారావు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు పోలీసులు పేర్కొన్నారు.


