పులివెందుల : దివంగత వైఎస్ ఆనంద్రెడ్డి ఆదర్శ జీవితం గడిపారని దివంగత వైఎస్సార్ సతీమణి, మాజీ సీఎం వైఎస్ జగన్ తల్లి, మాజీ ఎమ్మెల్యే వైఎస్ విజయమ్మ పేర్కొన్నారు. పులివెందులలో దివంగత వైఎస్ ఆనంద్రెడ్డి జ్ఞాపకార్థ ప్రార్థన కూడిక శనివారం నిర్వహించారు. ఈ ప్రత్యేక ప్రార్థన కార్యక్రమానికి వైఎస్ విజయమ్మ, వైఎస్ ఆనంద్రెడ్డి సోదరులు వైఎస్ ప్రకాష్రెడ్డి, వైఎస్ ప్రతాప్రెడ్డి, వైఎస్ మనోహర్రెడ్డి, వైఎస్ జోసఫ్రెడ్డి, వైఎస్ మధురెడ్డి, మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ వైఎస్ ప్రమీలమ్మ, డాక్టర్ ఈసీ సుగుణమ్మ, వైఎస్ ఆనంద్రెడ్డి కుమారుడు వైఎస్ రాజేష్రెడ్డి, కుమార్తెలు సునీత, సాధనలతోపాటు ఇతర కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వైఎస్ విజయమ్మ మాట్లాడుతూ వైఎస్ ఆనంద్రెడ్డి జీవితం వైఎస్ కుటుంబీకులపై ఎంతో ప్రభావితం చేసిందని చెప్పవచ్చునన్నారు. వైఎస్ ఆనంద్రెడ్డిది ఎవరినీ నొప్పించే మనస్తత్వం కాదన్నారు. వీలైనంత వరకు ఇతరులకు సహాయం చేసే గుణం కలిగి ఉండేవారన్నారు. వైఎస్ ఆనంద్రెడ్డి భౌతికంగా మనకు దూరమైనా ఆయన జ్ఞాపకాలు చిరస్థాయిగా ఉంటాయన్నారు. వైఎస్ ఆనంద్రెడ్డి పిల్లలకు తల్లిదండ్రులు దూరమైన వారు మనో నిబ్బరంతో ముందుకు సాగాలన్నారు. వైఎస్ ఆనంద్రెడ్డి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలన్నారు. వైఎస్ ఆనంద్రెడ్డి కుటుంబ సభ్యులు, పలువురు వైఎస్ ఆనంద్రెడ్డితో తమకున్న అనుబంధాన్ని గుర్తుకు చేసుకున్నారు.
వైఎస్ విజయమ్మ


