గోపవరం : తీవ్ర వర్షాభావ పరిస్థితుల కారణంగా అడవిలో చుక్క నీరు లేక వన్యప్రాణులు జనావాసాల్లోకి వస్తున్నాయి. అడవిలోని చెరువులు, కుంటలు ఎండిపోవడంతో తాగునీటి కోసం జింకలు, దుప్పులు రాత్రివేళల్లో గ్రామాల్లోని వ్యవసాయ బోర్ల పంట పొలాల్లోకి వస్తూ కుక్కల బారినపడి గాయపడుతున్నాయి. నెల్లూరు – ముంబై (ఎన్హెచ్–67) జాతీయ రహదారి పక్కనే దట్టమైన అటవీ ప్రాంతం ఉండటంతో, వన్యప్రాణులు తరచూ రోడ్డుపైకి వస్తూ వాహనాల ప్రమాదాలకు గురవుతున్నాయి. తాజాగా గోపవరం పరిధిలోని సెంచూరీ పానెల్స్ పరిశ్రమ వద్ద ఓ దుప్పిని గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో గాయపడింది. స్థానికులు అధికారులకు సమాచారం అందించడంతో పశువైద్యులు దానికి చికిత్స అందించి ప్రాణాలు కాపాడారు. రెండు రోజుల క్రితం మరో జింకను కుక్కలు వెంబడించగా గ్రామస్థులు రక్షించి అటవీశాఖకు అప్పగించారు. ప్రతినిత్యం జనావాసాల్లోకి వస్తున్న మూగజీవాలను కాపాడేందుకు అటవీ అధికారులు అటవీ ప్రాంతంలో సాసర్ పిట్ల ద్వారా తాగునీటి వసతి కల్పించాలని స్థానికులు కోరుతున్నారు.


