కడప సెవెన్రోడ్స్ : ప్రభుత్వరంగ సంస్థల్లో పనిచేస్తున్న ఆప్కాస్ ఔట్సోర్సింగ్, కాంట్రాక్టు కార్మికులను పర్మినెంట్ చేయాలని డిమాండ్ చేస్తూ సీఐటీయూ నాయకులు బుధవారం కడప నగరంలోని మహావీర్ సర్కిల్ వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. సీఐటీయూ నగర అధ్యక్ష, కార్యదర్శులు పి.చంద్రారెడ్డి, పి.వెంకటసుబ్బయ్యలు మాట్లాడు తూ రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న కార్మికులను తక్షణమే పర్మినెంట్ చేస్తామంటూ అధికారంలోకి రాకమునుపు మాట్లాడిన చంద్రబాబు అధికారంలోకి వచ్చి రెండేళ్లు దాటినా ఆ దిశగా చర్యలు చేపట్టలేదని విమర్శించారు. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. సంక్షేమ పథకాలను వర్తింపజేయాలన్నారు. ధరలు పెరుగుతున్నాయేతప్ప కార్మికుల వేతనాలు పెంచడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం వద్ద బడ్జెట్ లేదంటున్నారని, కార్పొరేట్ సెక్టారుకు మాత్రం ఎకరా భూమి 95 పైసలకే కట్టబెడుతూ అనేక రాయితీలు ఇస్తున్నారని ధ్వజమెత్తారు. గురువారం రాష్ట్ర పిలుపులో భాగంగా కలెక్టరేట్ ఎదుట నిర్వహించే ధర్నాలో పెద్ద ఎత్తున పాల్గొనాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మున్సిపల్ యూనియన్ జిల్లా ఉపాధ్యక్షుడు తిరుపాల్, నగర వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీరామ్, ఉపాధ్యక్షులు ప్రకాశ్, డ్రైవర్స్ యూనియన్ కార్యదర్శి కిరణ్, నాగరాజు, శ్రీధర్బాబు తదితరులు పాల్గొన్నారు.


