● పెండింగ్ కేసులను త్వరితగతిన
పరిష్కరించాలి
● జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్
కడప అర్బన్ : రోడ్డు ప్రమాదాలు నియంత్రించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ పోలీస్ అధికారులను ఆదేశించారు. బుధవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ప్రొద్దుటూరు, జమ్మలమడుగు సబ్ డివిజన్ల నేర సమీక్ష సమావేశం నిర్వహించి ఆయన మాట్లాడారు. రోడ్డు ప్రమాదాలు జరిగేందుకు కారణాన్ని గుర్తించి నివారణకు చర్యలు తీసుకోవాలన్నారు. రాత్రిపూట హెడ్ లైట్స్ లేకుండా తిరిగే వాహనాలు, రేడియం స్టిక్కర్ లేకుండా వెళ్లే వాహనాలపై, మద్యం సేవించి వాహనాలు నడిపే వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఫ్యాక్షన్ ప్రభావిత గ్రామాలపై ప్రత్యేక దష్టి సారించి గస్తీని పెంచడంతో పాటు గ్రామ సభలు, పల్లె నిద్ర, గ్రామాల సందర్శన తప్పనిసరిగా నిర్వహించాలని ఆదేశించారు. గంజాయి, డ్రగ్స్ పై ప్రత్యేక కార్యాచరణ రూపొందించి కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. డ్రోన్ కెమెరాల ద్వారా గంజాయి, ఇతర మత్తు పదార్థాలు, బహిరంగ మద్యపానం చేసే వారిపై దాడులు నిర్వహించి కేసులు నమోదు చేయాలని ఆదేశించారు. చోరీలు జరగకుండా గస్తీ పెంచాలని, చోరీ కేసుల్లో సొత్తును రికవరీ చేయాలని ఆదేశించారు. పెండింగ్ కేసులను త్వరితగతిన చేధించాలని ఆదేశించారు. షాపులు, లాడ్జిలు, హోటళ్లు, వాణిజ్య సముదాయాలు, అపార్ట్ మెంట్లు తదితర జన సమ్మర్థమైన ప్రదేశాల్లో తప్పనిసరిగా సి.సి కెమెరాలు అమర్చుకుని, వాటి పనితీరుపై శ్రద్ద వహించేలా నిర్వాహకులకు అవగాహన కల్పించాలని ఎస్.పి. ఆదేశించారు. సమావేశంలో జమ్మలమడుగు డీఎస్పీ కె.వెంకటేశ్వరరావు, ప్రొద్దుటూరు, జమ్మలమడుగు సబ్ డివిజన్ లోని సీఐలు, ఎస్ఐలు పాల్గొన్నారు.


