కలసపాడు : ప్రాణాపాయ స్థితిలో ఉన్న పేద విద్యార్థికి మేమున్నామంటూ అండగా నిలిచి వైద్యచికిత్స కోసం ఆర్థిక సహకారం అందించిన ఉపాధ్యాయులు, దాతల సహకారం స్ఫూర్తిదాయకమని ఆల్ ఇండియా ఫెడరేషన్ ఆఫ్ ఎలిమెంటరీ టీచర్స్ ఆర్గనైజేషన్ (ఏఐఎఫ్ఈటీఓ)జాతీయ కార్యదర్శి పి.రమణారెడ్డి తెలిపారు. ఎగువరామాపురం జెడ్పీ ఉన్నత పాఠశాలలో 6వ తరగతి చదువుతున్న సుంకరమదన్యాదవ్ ఇటీవల పాముకాటుకు గురయ్యాడు. అత్యవసర చికిత్స నిమిత్తం గిద్దలూరులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించారు. తండ్రి లేకపోవడంతో పాటు పేదరికం కారణంగా ఆసుపత్రి ఖర్చులు భరించలేని స్థితిని గమనించిన ఉపాధ్యాయ సంఘ నాయకుడు రమణారెడ్డి, పాఠశాల ఉపాధ్యాయులు కస్తూరిశ్రీనివాసులు, కె.వి.సత్యనారాయణ, ఎస్.కమల్ వారి వంతుగా విద్యార్థికి కొంత ఆర్థిక సహాయం అందజేస్తూ సోషల్ మీడియా వేదికగా పంపిన సందేశానికి స్పందించిన పలువురు దాతలు దాతృత్వంతో అందజేసిన రూ.1,53,500లును సోమవారం ఆసుపత్రికి వెళ్లి విద్యార్థి తల్లి కాంతమ్మకు అందజేశారు. ఈ సందర్భంగా రమణారెడ్డి, పాఠశాల ఉపాధ్యాయులు మాట్లాడుతూ ఉపాధ్యాయ, విద్యారంగ సమస్యల పరిష్కారంలోనే కాకుండా సామాజిక సేవలో సైతం ముందుంటామని చాటి చెబుతూ ఆపదలో ఉన్న విద్యార్థికి సహాయం చేసిన ఎస్టీయూ నాయకులు, కార్యకర్తలు, ఉపాధ్యాయనీ, ఉపాధ్యాయులు, ఇతర దాతలు అభినందనీయులని పేర్కొన్నారు. విద్యార్థి మదన్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నామన్నారు. కార్యక్రమంలో ఎస్టీయూ మార్కాపురం జిల్లా అధ్యక్షుడు టి.కె.ఎస్.ప్రసాద్, కడప జిల్లా ఆర్థిక కార్యదర్శి యు.సుబ్రహ్మణ్యం, సీనియర్ నాయకులు రాఘవరెడ్డి, జిల్లా కార్యవర్గ సభ్యులు శేఖర్బాబు, వీరారెడ్డి, పాఠశాల ఉపాధ్యాయినీ ఉపాధ్యాయులు మణిమాల, శివ తదితరులు పాల్గొన్నారు.


