ఎర్రగుంట్ల : ఎర్రగుంట్ల పట్టణం పరిధిలో ఈ నెల 11 న జరిగిన సంబతూరు వీరాంజనేయులు (46) హత్య కేసులో నిందితులను అరెస్టు చేసినట్లు ఎర్రగుంట్ల సీఐ విశ్వనాథరెడ్డి తెలిపారు. సోమవారం ఆయన విలేకరులకు వివరాలు వెల్లడించారు. ఎర్రగుంట్ల పట్టణంలోని నడివూరులో నివాసం ఉంటున్న సంబతూరు వీరాంజనేయులు ఇంటి వద్ద కట్టెలు కొడుతుండుగా ముగ్గురు గుర్తు తెలియని వ్యక్తులు మద్యం తాగి వీధిలోకి వచ్చారు. స్థానికుడు సురేష్ వీరిని ప్రశ్నించారు. వారు హిందీలో గొడవ పడుతుండగా, వీరాంజనేయులు వచ్చిన వారిని అడ్డుకున్నారు. వారి మధ్య వాగ్వాదం జరిగింది.ఈ గొడవలో ఒకరు కత్తితో వీరాంజనేయులు పొట్టలో పొడిచారు. తీవ్ర రక్తస్రావం జరిగింది. సురేష్ అరుపులు వేయడంతో శేఖర్ అక్కడి రాగా.. నిందితులు రాళ్లు కర్రలు విసురుతూ పారిపోయారు. గాయపడిన వీరంజనేయులు ఈ నెల 13న చికిత్స పొందుతూ కడప రిమ్స్లో మృతి చెందాడు. ఈ కేసుకు సంబంధించి ఎస్ఐ నాగమురళి ఆధ్వర్యంలో మూడు బృందాలు ఏర్పాటు చేసి గాలింపు చేశారు. ప్రత్యక్ష సాక్షుల వాంగ్మూలాలు, టెక్నికల్ ఎవిడెన్స్, నేర స్థలంలో స్వాధీనం చేసుకున్న వస్తువుల ఆధారంగా ధర్యాప్తులో తాడిపత్రికి చెందిన గురు సాయి, శంకర్(బద్రి), ఒక బాల నేరస్తుడి ప్రమేయం ఉన్నట్లు బయట పడిందన్నారు. వెంటనే జమ్మలమడుగు డీఎస్పీ వేంకటేశ్వరరావు ఆదేశాల మేరకు సీఐ విశ్వనాథరెడ్డి పర్యవేక్షణలో, ఎస్ఐ నాగమురళితో మూడు బృందాలను ఏర్పాటు చేసి పట్టణంలోని ప్రొద్దుటూరు రోడ్డున ఉన్న ఎస్వీ కల్యాణ మండపం పక్కన శ్రీ ఆంజనేయ స్వామి గుడి వద్ద గురుసాయి, శంకర్, ఒక బాలనేరస్తుడిని పట్టుకున్నట్ల తెలిపారు. ఆధునిక పరిజ్ఞానంతో కేసును ఛేదించిన సీఐ విశ్వనాథరెడ్డి, ఎస్ఐ నాగమురళిలను డీఎస్పీ వేంకటేశ్వరరావు అభినందించారు.


