కడప అర్బన్: కడప నగరంలోని తాలూకా పోలీస్స్టేషన్ పరిధిలో ఓ ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాన్ని బెదిరించి డబ్బులు డిమాండ్ చేసిన ముగ్గురు యూట్యూబర్లతో పాటు, మరికొందరిపై కేసు నమోదు చేసినట్లు సీఐ రాజేంద్రనాథ్ యాదవ్ తెలిపారు. ఈ కేసులో నిందితులుగా జగన్ నాయక్, ఓబయ్య, ఖదీరున్నిసా ఉన్నారు. ఈ సంఘటనపై సమగ్రంగా దర్యాప్తు చేసి బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని సీఐ వెల్లడించారు.
మైదుకూరు : మైదుకూరులోని బద్వేలు రోడ్డులో ఆదివారం మద్యం తాగి వాహనాలు నడుపుతున్న ఐదుగురిపై అర్బన్ సీఐ కె.రమణారెడ్డి కేసు నమోదు చేశారు. బద్వేలు రోడ్డులో సాయంత్రం వాహనాల తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా మద్యం తాగి వాహనాలు నడుపుతున్న ఐదుగురిని గుర్తించి కేసు నమోదు చేశారు. ఈ సందర్భంగా ద్విచక్ర వాహనాల్లో వెళుతున్న వారికి సీఐ కౌన్సెలింగ్ ఇచ్చారు. కార్యక్రమంలో అర్బన్ ఎస్ఐ కత్తి వెంకటరమణ, సిబ్బంది పాల్గొన్నారు.
రాజంపేట : పట్టణంలోని ఆర్ఎస్రోడ్డులో ఉన్న జైన్ సూపర్ మార్కెట్లో ఆదివారం తెల్లవారుజామున గుర్తుతెలియని వ్యక్తి చోరీకి పాల్పడ్డారు. షట్టర్లాక్ కట్ చేసి, లోపలికి ప్రవేశించి క్యాస్ కౌంటర్లోని దాదాపు రూ.30 వేల నగదును అపహరించాడు. షట్టర్ ఇనుపరాడ్ తొలిగించే క్రమంలో నిందితుడి ఎడమచేతికి అద్దం తగిలి గాయపడ్డారు. దీంతో క్యాస్ కౌంటర్ ప్రాంతంలో రక్తపు మరకలున్నాయని పోలీసులు తెలిపారు. సీసీ కెమెరాలను పరిశీలించిన తర్వాత చోరీకి పాల్పడిన వ్యక్తికి 45 ఏళ్లు ఉన్నట్లు ఽనిర్ధారించుకున్నారు. క్లూస్ టీం కూడా చోరీ ప్రాంతంలో ఆధారాలు సేకరించిందని పోలీసులు తెలిపారు. ఇటీవల ఇదే సూపర్మార్కెట్లో చోరీ జరిగిందని పోలీసులు చెబుతున్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.


