కడప వైఎస్ఆర్ సర్కిల్ : నీట్ ప్రశ్నపత్రాల లీకేజీలకు నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే రాజీనామా చేయాలని, అవినీతి, అక్రమాలకు కేంద్రంగా మారిన నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టిఏ)ను రద్దు చేసి పారదర్శకమైన పరీక్షా వ్యవస్థను ఏర్పాటు చేయాలని నేడు విద్యార్ధి సంఘాలు తలపెట్టిన బంద్ కు ప్రజాసంఘాల సంఘీభావం తెలియజేస్తూ నిరసన చేపడుతున్నట్లు ప్రజా సంఘాల నాయకులు జి.చంద్ర, చంద్రశేఖర్, రాజా వెంగల్ రెడ్డి, మల్లెల భాస్కర్, బి ఒబయ్య, పేర్కొన్నారు. గురువారం కడపలోని ఎస్టీయూ భవన్లో వారు మాట్లాడుతూ లక్షలాది మంది విద్యార్థుల జీవితాలతో కేంద్ర ప్రభుత్వం చెలగాటమాడుతోందని మండిపడ్డారు. దేశ అభివద్ధి కోసం తన జీవితాన్ని అంకితం చేసిన ప్రముఖ ఇంజనీర్, పర్యావరణవేత్త సోను వాంగ్చుక్ ఇరవై రోజులుగా ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నా ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం కనీస మానవత్వం కూడా చూపకపోవడం అమానుషమన్నారు. విద్యార్థుల ‘చలో పార్లమెంట్‘కార్యక్రమంలో లక్షలాది మంది యువత శాంతియుతంగా పాల్గొంటే, వారిని చర్చలకు ఆహ్వానించాల్సిన ప్రభుత్వం పోలీసులను ఉసిగొల్పి లాఠీలతో విచక్షణారహితంగా కొట్టించడం, విద్యార్థినులని కూడా చూడకుండా ఈడ్చిపారేయడం సిగ్గుచేటు అని అన్నారు. కార్యక్రమంలో ప్రజా సంఘాల నాయకులు కేసీ బాదుల్లా, ఎన్.శివరాం, ఓబులేసు, ఏఐఎస్ఎఫ్ అరుణ్, ఎస్ఎఫ్ఐ రవి, భాగ్యలక్ష్మి, నారాయణ, రాహుల్ తదితరులు పాల్గొన్నారు.


