జీఓ నంబర్ 396ను రద్దు చేయాలని డిమాండ్
కడప కార్పొరేషన్: కడప నగరంలోని ఐటీఐ సర్కిల్ సమీపంలోని బాలాజీ నగర్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం వద్ద ఆంధ్రప్రదేశ్ దస్తావేజు లేఖరుల సంక్షేమ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సామూహిక రిలే నిరాహార దీక్షలకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మద్దతు తెలిపింది. బుధవారం ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు పి. రవీంద్రనాథ్రెడ్డి, మాజీ డిప్యూటీ సీఎం అంజద్బాషా, సీఈసీ సభ్యులు కె. సురేష్ బాబు దస్తావేజు లేఖరులకు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా రవీంద్రనాథ్రెడ్డి మాట్లాడుతూ జీవో నంబర్ 396ను తక్షణమే రద్దు చేసి, ప్రజల ఆస్తులకు సంపూర్ణ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. దశాబ్దాలుగా ప్రజలకు సేవలందిస్తున్న దస్తావేజు లేఖరుల సమస్యలపై ప్రభుత్వం నిర్లక్ష్యం ప్రదర్శించడం బాధాకరమన్నారు. ప్రజల హక్కులు, ఆస్తుల భద్రత విషయంలో వైఎస్సార్సీపీ ఎల్లప్పుడూ ప్రజల పక్షాన నిలుస్తుందని స్పష్టం చేశారు. మాజీ డిప్యూటీ సీఎం అంజద్బాషా మాట్లాడుతూ ప్రజల ఆస్తులు, ప్రభుత్వ సేవలను బడా బాబుల చేతుల్లోకి అప్పగించే ప్రయత్నమే జీవో ఎంఎస్ నెం. 396 వెనుక ఉన్న అసలు ఉద్దేశమని ఆరోపించారు. ప్రజా ప్రయోజనాల కంటే కొందరి ప్రయోజనాలకే ప్రాధాన్యం ఇస్తూ కూటమి ప్రభు త్వం నిర్ణయాలు తీసుకుంటోందని విమర్శించారు. వైఎస్సార్సీపీ సీఈసీ సభ్యులు కె. సురేష్ బాబు మాట్లాడుతూ ప్రజల ఆస్తుల భద్రతకు భంగం కలిగించే ఎలాంటి నిర్ణయాన్నీ ప్రజలు అంగీకరించరని, ప్రజల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోకుండా ఏకపక్షంగా వ్యవహరించడం సరైన విధానం కాదన్నారు. మాజీ డిప్యూటీ మేయర్ నిత్యానంద రెడ్డి, ఎస్సీసెల్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ పులి సునీల్ కుమార్, పబ్లిసిటీ వింగ్ స్టేట్వర్కింగ్ ప్రెసిడెంట్ సీహెచ్ వినోద్, మాజీ కార్పొరేటర్ మహమ్మద్ షఫీ, దస్తావేజు లేఖరుల సంఘం నాయకులు చెండ్రాయుడు, వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు.


