కడప కార్పొరేషన్: కూటమి ప్రభుత్వంలో మహిళలకు రక్షణ కరువైందని వైఎస్సార్సీపీ జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలు టీపీ వెంకట సుబ్బమ్మ అన్నారు. సోమవారం జిల్లా పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆమె మట్లాడుతూ చంద్రబాబు సర్కార్ వచ్చినప్పటి నుంచి మహిళలపై దాడులు, వేధింపులు పెరిగాయన్నారు. మహిళలకు రక్షణ కల్పించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. గుంటూరులో ఒక మహిళను వివస్త్రను చేసి మూత్రం పోసుకునేలా దాడి చేశారని, తాజాగా బద్వేల్లో ఒక మహిళ రవిక చింపి దాడి చేశారన్నారు. ఈ రెండు ఘటనల్లో పాల్గొన్నది తెలుగుదేశం పార్టీ వారేననన్నారు. పోలీసులకు ఫిర్యాదు చేసినా ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఆ పార్టీ నాయకులు చెలరేగిపోతున్నారన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మహిళల రక్షణపై సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. హోంమంత్రి మహిళ అయినప్పటికీ మహిళలకు ఎలాంటి న్యాయం జరగడం లేదన్నారు. మహిళలపై దాడులకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మహిళలపై దాడులను నిరసిస్తూ మంగళవారం ఽఅంబేడ్కర్ సర్కిల్లో ధర్నా నిర్వహించనున్నట్లు తెలిపారు. నగర మహిళా విభాగం అధ్యక్షురాలు బండి దీప్తి మాట్లాడుతూ బద్వేల్లో ఒక ఇంటి విషయంలో టీఎన్ఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు బొజ్జా తిరుమలేష్ జోక్యం చేసుకొని, రౌడీమూకలను తీసుకెళ్లి గొడవ చేయడం దారుణమన్నారు. పోలీసులు నిష్ఫక్షపాతంగా వ్యవహరించి దాడికి పాల్పడిన వారిపై చట్ట పరంగా చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో మాజీ కో ఆప్షన్ సభ్యురాలు బి. మరియలు, మహిళా విభాగం రాష్ట్ర కార్యదర్శులు రత్నకుమారి, సునీత పాల్గొన్నారు.
వైఎస్సార్సీపీ జిల్లా మహిళా విభాగం
అధ్యక్షురాలు టీపీ వెంకట సుబ్బమ్మ


