సిద్దవటం : మండలంలోని కడప–చైన్నె జాతీయ రహదారి మాధవరం–1 పంచాయతీ పార్వతీపురం గ్రామంలో ఆదివారం రాత్రి ఆగి వున్న లారీలో గుర్తు తెలియని వ్యక్తులు డీజిల్ చోరీ చేశారు. సోమవారం ఉదయం లారీ డ్రైవర్ మౌలాలి మాట్లాడుతూ తాడిపత్రి నుంచి చైన్నెకి సిమెంట్ తీసుకెళతున్నామని చెప్పాడు. ప్రొద్దుటూరులో ఆదివారం రాత్రి లారీకి టైర్లు మార్చుకొని 10 గంటలకు బయలుదేరి కడపలో బంధువులతో మాట్లాడి సిద్దవటం మండలంలోని మాధవరానికి చెరుకున్నానని, లారీ రోడ్డు పక్కన ఆపేసి నిద్రపోయానని, లారీకి ఉన్న ఆయిల్ ట్యాంక్ పగులకొట్టి 390 లీటర్ల డీజిల్ చోరీ చేశారని డ్రైవర్ తెలిపాడు, చోరీకి గురైన డీజిల్ విలువ సుమారు రూ.40 వేలు అవుతుందన్నారు. డయల్ 100కు ఫిర్యాదు చేయడంతో ఎస్ఐ హారిక ఆధ్వర్యంలో పోలీసులు విచారణ చేపట్టారు. పలు అనుమానిత దుకాణాలు పరిశీలించారు.


