పోరుమామిళ్ల: మండలంలోని ముసల్రెడ్డిపల్లెకు రెండు కిలోమీటర్ల దూరంలో అడవి ప్రాంతంలో ఓ మహిళ మృతదేహం లభ్యమైంది. వివరాల్లోకెళితే కాశినాయన మండలం మూలపల్లెకు చెందిన చౌడేశ్వరమ్మ(47) మూడురోజుల క్రితం ఇంటి నుంచి వెళ్లిపోయింది. ఆమెకు మతిస్థిమితం లేకపోవడంతో కుటుంబీకులు హైదరాబాద్ ఎర్రగడ్డ ఆసుపత్రిలో చికిత్స చేయిస్తున్నట్లు తెలిసింది. మూలపల్లెకు చెందిన పేరగాని పీరయ్యతో ఆమె వివాహం జరిగింది. వారికి ఒక కుమారుడు ఉన్నాడు. ఆమె ఇంటి నుండి వెళ్లిపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేయగా ఎస్ఐ రెండు రోజుల క్రితం వాట్సాప్ గ్రూపుల్లో వివరాలు పంపించారు. ఆమె శుక్రవారం ముసల్రెడ్డిపల్లె నుంచి అడవి వైపు వెళుతుండగా పొలాల్లో ఉన్నవారు ఆమెను పలకరిస్తే వారిని తిడుతూ రాళ్లు విసిరిందని తెలిసింది. ఆమె గొణుక్కుంటూ వెళ్లిందని, ఆ ప్రాంతంలో ఆహారం, నీళ్లు లేక మృతి చెంది ఉంటుందని స్థానికులు భావిస్తున్నారు.ఈ విషయమై పోరుమామిళ్ల ఎస్ఐ హనుమంతును విచారించగా ఆదివారం మధ్యాహ్నం చౌడేశ్వరమ్మ అడవిలో మృతి చెందినట్లు గుర్తించి, బంధువులకు సమాచారం ఇచ్చామన్నారు.మృతదేహాన్ని వారికి అప్పగించామని ఎస్ఐ తెలిపారు.
రోడ్డుప్రమాదంలో
ఒకరికి గాయాలు
సుండుపల్లె : సుండుపల్లె–గుండ్లపల్లె మార్గంలో వడ్లపల్లి సమీపంలోని బ్రిడ్జి దగ్గర ద్విచక్రవాహనం అదుపు తప్పి బోల్తా పడటంతో ఒకరికి గాయాలయ్యాయి. గుండ్లపల్లికు చెందిన సుబ్బరాయుడు సుండుపల్లెకు వచ్చి తిరిగి తన స్వగ్రామానికి వెళ్తుండగా ఈ సంఘటన చోటు చేసుకుంది. స్థానికులు 108కు సమాచారం అందించారు. వారు సంఘటన స్థలానికి చేరుకుని క్షతగాత్రున్ని రాయచోటి ప్రభుత్వాసుపత్రికి తరలించారు.


