● సర్కార్ సూళ్లలో పిల్లల చేరికల చింత
● ఈ ఏడాది తగ్గిన అడ్మిషన్ల సంఖ్య
● ఆందోళనలో అయ్యవార్లు
కడప ఎడ్యుకేషన్: సర్కారు బడుల్లో మౌలిక వసతులను కల్పించక పోవడంతోపాటు తగినంత మంది ఉపాధ్యాయులను నియమించకుండా సర్కార్ చోద్యం చూస్తోంది. దీంతో విద్యార్థులు ప్రైవేటు పాఠశాల వైపు మొగ్గు చూపుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. గత సంవత్సరంతో పోలిస్తే గవర్నమెంట్ స్కూళ్లలో ఈ విద్యా సంవత్సరం అడ్మిషన్ల సంఖ్య తగ్గడమే ఇందుకు నిదర్శనంగా నిలుస్తోంది. దీంతోపాటు ఇటీవల ఉపాధ్యాయుల కొందరు విద్యార్థుల సంఖ్య తగ్గితే తాము పనిచేసే పాఠశాలలో తమ పోస్టు పోతుందనే ఆందోళనతో కొన్ని బినామీ అడ్మిషన్లు చేయించినట్లు కూడా ఆరోపణలు ఉన్నాయి. మాజీ సీఎం జగన్మోహన్రెడ్డి హయాంలో అమలు చేసిన విద్యా సంస్కరణలకు ప్రస్తుత ప్రభుత్వం తూట్లు పొడుస్తూ అనుసరిస్తున్న వైఖరి కూడా కారణమని పలువురు విద్యావేత్తలు, మేధావులు అంటున్నారు.
చేరికలు తగ్గుముఖం
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల చేరికలు ఈ ఏడాది తగ్గుముఖం పట్టాయి. ప్రధానంగా 1వ తరగతిలో చేరే విద్యార్థుల సంఖ్య తగ్గింది. అలాగే 2వ తరగతితోపాటు 4,6,7 తరగతుల్లో కూడా అదే పరిస్థితి నెలకుంది. సంబంధిత తరగతుల్లో తగ్గిన చేరికల విద్యార్థులు చాలా మంది విద్యార్థులు ప్రైవేటు పాఠశాలల్లో చేరినట్లు తెలుస్తోంది. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల చేరికలను పెంచేందుకు ఏటా ప్రభుత్వం నిర్వహించే బడిబాట కార్యక్రమం ద్వారా ఆశించిన ఫలితాలు ఇవ్వడం లేదు. ప్రభుత్వం ప్రచారానికి ెపెద్దపీట వేస్తూ సర్కార్ బడుల్లో మెరుగైన వసతులు, నాణ్యమైన విద్య అందిస్తామని చెబుతున్నా ప్రజల్లో అంతగా స్పందన లేకపోగా నమ్మకం కూడా సన్నగిల్లుతోందనే ఆరోపణలు వినిపిస్తున్నారు. ప్రధానంగా 1వ తరగతిలో గతేడాది కంటే ఈ ఏడాది ప్రవేశాల సంఖ్య తగ్గింది. అంటే ప్రభుత్వ విద్యపై తల్లిదండ్రులకు విశ్వాసం సన్నగిల్లుతోందనే చెప్పాలి. చాలా మంది తల్లిదండ్రులకు ప్రైవేటు పాఠశాలల్లో ఆర్థిక భారమైనా తమ పిల్లలను అక్కడే చేర్పించేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. ఈ ఏడాది ప్రభుత్వ పాఠశాలల్లో 2,190 విద్యా విద్యార్థుల సంఖ్య తగ్గడమే కారణం. దీంతో సర్కార్ బడుల అయ్యవార్లు అందోళన చెందుతున్నారు.
గణాంకాలు ఇలా...
జిల్లా అధికారిక వివరాల ప్రకారం 2025–25 విద్యా సంవత్సరంలో 1,38,716 మంది విద్యార్థులు చేరగా 2026–27 విద్యా సంవత్సరంలో 1,36,526 మంది మాత్రమే చేరారు. అంటే గతేడాది కంటే ఈ ఏడాది 2,190 మంది విద్యార్థుల సంఖ్య తగ్గింది. ఇందులో భాగంగా 1వ తరగతిలో గతేడాది 11,978 మంది చేరితే ఈ ఏడాది 11,516 మంది మాత్రమే చేరారు. అంటే గతేడాది కంటే ఈ ఏడాది 462 మంది విద్యార్థుల చేరిక తగ్గింది. అలాగే 2025–26 సంవత్సరంలో 2వ తరగతిలో 12,573 మంది విద్యార్థులు చేరితే 2026–27లో 12,149 మంది చేరారు. అంటే గతేడాది కంటే 424 మంది విద్యార్థుల సంఖ్య తగ్గింది. దీంతోపాటు 4వ తరగతిలో గతేడాది 12,505 మంది విద్యార్థులు చేరితే ఈ ఏడాది 11,978 మంది చేశారు. గతేడాదికంటే ఈ ఏడాది 527 మంది తక్కువగా విద్యార్థులు చేశారు. అలాగే 6వ తరగతిలో గతేడాది 13,943 మంది చేరితే ఈ ఏడాది 11,597 మంది చేశారు. అంటే గతేడాదికంటే ఈ ఏడాది ప్రభుత్వ పాఠశాలల్లో చేరే విద్యార్థుల సంఖ్య 2,346కు తగ్గింది. 7వ తరగతిలో కూడా గతేడాది 16,154 మంది చేరితే ఈ ఏడాది 14,453 మంది చేశారు. మొత్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో చేరే విద్యార్థుల సంఖ్య గతేడాది కంటే ఈ ఏడాది 2190 మంది సంఖ్య తగ్గింది.
కొన్ని తరగతుల్లో పెరిగిన విద్యార్థులు
3వ తగరతిలో 877 మంది, 5వ తరతిలో 120 మంది, 8వ తరగతిలో 869 మంది, 9వ తరగతిలో 195 మంది, 10వ తరగతిలో 1,569 మంది చొప్పున ఈ ఏడాది విద్యార్థుల సంఖ్య పెరిగింది. మొత్తంగా ఈ ఏడాది ప్రభుత్వ పాఠశాలల్లో కొన్ని తరగతులు మినహా మిగతా తరగతుల్లో విద్యార్థుల సంఖ్య తగ్గింది.
అన్ని మేనేజ్మెంట్స్లో విద్యార్థుల సంఖ్య
2025–26లో చేరిన విద్యార్థులు 3,38,590
2026–27లో : 3,28,195
విద్యార్థుల చేరికల్లో వ్యత్యాసం : 10,395
ప్రభుత్వ మేనేజ్మెంట్లో విద్యార్థులు
2025–26లో : 1,38,716
2026–27లో : 1,36,526
విద్యార్థుల చేరికల్లో వ్యత్యాసం : 2,190


