కాశినాయన : మండలంలోని ఓబుళాపురం వద్ద శుక్రవారం ఎర్రచందనం తరలిస్తున్న వాహనాన్ని తిరుపతి టాస్క్ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. వాహనాన్ని నరసాపురం పోలీస్స్టేషన్కు తరలించారు. హర్యానా రిజిస్ట్రేషన్ కలిగిన ఈ వాహనంలోని 30కిపైగా ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకుని, ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు. తిరుపతి టాస్క్ఫోర్స్ ఎస్పీ ఆదేశాల మేరకు వాహనాన్ని, నిందితులను తిరుపతికి తీసుకెళ్లారని ఎస్ఐ యోగేంద్ర తెలిపారు.
● ఇద్దరు అంధులకు చూపు
సింహాద్రిపురం : మహిళ నేత్రదానం చేసి ఇద్దరు అంధులకు చూపును ప్రసాదించిందని నేత్ర సేకరణ కేంద్ర అధ్యక్షుడు రాజు పేర్కొన్నారు. శనివారం మండలంలోని బలపనూరు గ్రామానికి చెందిన కప్పల లక్ష్మీదేవి మరణించింది. మృతురాలి కుటుంబ సభ్యులు నేత్రదానానికి అంగీకరిస్తూ నేత్ర సేకరణ కేంద్ర అధ్యక్షుడు రాజుకు సమాచారం ఇచ్చారు. వెంటనే రాజు నేత్ర సేకరణ కేంద్ర టెక్నీసియన్ ప్రశాంత్తో కలిసి మృతురాలి ఇంటికి చేరుకుని ఆమె మృతదేహం నుండి కార్నియాలను సేకరించి హైదరాబాద్లోని ఎల్వీ నేత్రాలయానికి పంపించారు. ఈ సందర్భంగా రాజు మాట్లాడుతూ నేత్రదానం చేసే వారు 9966509364 ఫోన్ నంబర్కు సంప్రదించాలన్నారు. నేత్రదానం చేసిన కప్పల లక్ష్మీదేవి, కుటుంబ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు.
● ఇరువురికి గాయాలు
చింతకొమ్మదిన్నె : మండలంలోని రసూల్ పల్లెకు చెందిన తొండూరు భాస్కరరెడ్డి అనే వ్యక్తి గురువారం రాత్రి చింతకొమ్మదిన్నె మెయిన్ రోడ్డులోని ఓ హోటల్ వద్ద ఉన్నవారిని దూషించడంతో చింతకొమ్మదిన్నెకు చెందిన సురేష్ రెడ్డి సర్ధిచెప్పి పంపే ప్రయత్నం చేశాడు. అయితే భాస్కరరెడ్డి వెంటనే కట్టెతో దాడి చేయడంతో సురేష్ రెడ్డి కింద పడిపోయాడు. సురేష్రెడ్డి తండ్రి సూర్యనారాయణరెడ్డి అడ్డుకొనే ప్రయత్నం చేయగా.. ఆయనపై కూడా దాడి చేశాడు. వీరు రిమ్స్ ఆసుపత్రిలో చికిత్స తీసుకొని శుక్రవారం డిశ్చార్జ్ అయ్యారు. చింతకొమ్మదిన్నె పోలీసుస్టేషన్లో తమపై దాడిపై ఫిర్యాదు చేసినట్లు సమాచారం.


