కడప సెవెన్రోడ్స్: దేవునికడప శ్రీ లక్ష్మి వెంకటేశ్వరస్వామి ఆలయ వార్షిక తెప్పోత్సవాలో భాగంగా రెండవరోజు గురువారం పుష్కరిణిలో తెప్పపై స్వామి, అమ్మవార్లు ఐదుమార్లు విహరించారు. తొలుత ఆలయంలో స్వామి, అమ్మవార్ల మూలమూర్తులను పల్లకిపై కొలువుదీర్చి ఊరేగింపుగా పుష్కరిణి వద్దకు చేర్చారు. అక్కడ అలంకార మండపంలో విశేష అభిషేకాలు, అలంకారం చేసి, మంగళ హారతులు ఇచ్చి పుష్కరిణిలో సిద్ధంగా ఉంచిన తెప్పపై కొలువుదీర్చారు. ప్రత్యేక పూజల అనంతరం అర్చకులు కృష్ణమోహన్ బృందం, ఇన్స్పెక్టర్ ఈశ్వర్రెడ్డి పర్యవేక్షణలో మంగళ హారతులు ఇచ్చి తెప్పను జల విహారం చేయించారు. అందులో భాగంగా తొలిసారి వేద పండితుల మంత్రోచ్ఛాటనలతో, తర్వాత రెండుసార్లు టీటీడీ అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారుల భక్తి గీతాలాపనలతో, మరో రెండుసార్లు మంగళ వాయిద్యాలతో స్వామి, అమ్మవార్లు పుష్కరిణిలో హాయిగా విహరించారు. భక్తులు ఒళ్లంతా కళ్లు చేసుకుని ఈ మనోహరమైన దృశ్యాన్ని తిలకించి పులకించిపోయారు.


