కడప ఎడ్యుకేషన్ : జిల్లాలో బోర్డు ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ వారి గుర్తింపు పొందిన కళాశాలల్లో మాత్రమే తల్లిదండ్రులు తమ పిల్లలను ఇంటర్మీడియట్ కోర్సులను చేర్పించాలని ఇంటర్మీడియట్ ఆర్ఐఓ టీఎన్వీ వెంకటేశ్వర్లు తెలిపారు. స్టడీ సెంటర్లు, కోచింగ్ సెంటర్లు వంటి సంస్థలు ఇంటర్మీడియట్ బోర్డు పరిధిలోకి రావని తెలిపారు. ఎలాంటి అనుమతిలేని జూనియర్ కళాశాలలు, కోచింగ్ సెంటర్లలో పిల్లలను చేర్పిస్తే ఆర్ఐఓ ఆఫీస్, ఇంటర్మీడియట్ విద్యామండలి బాధ్యత వహించదని తెలిపారు.
డ్రైనేజీలో పడి వృద్ధుడి మృతి
ప్రొద్దుటూరు క్రైం : జమ్మలమడుగు మండలంలోని గూడెంచెరువు గ్రామానికి చెందిన సుబ్బరాయుడు (60) అనే వృద్ధుడు డ్రైనేజి కాలువలో పడి మృతి చెందాడు. వన్టౌన్ పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. కొన్నేళ్ల క్రితం సుబ్బరాయుడు భార్య మృతి చెందింది. అప్పటి నుంచి అతను ప్రొద్దుటూరులో ఉంటూ బేల్దారి పని చేసుకునేవాడు. ఇటీవల భిక్షాటన కూడా చేస్తున్నట్లు స్థానికులు చెబుతున్నారు. ఈ క్రమంలో మద్యం మత్తులో ఉన్న అతను మంగళవారం ప్రమాదవశాత్తు రామేశ్వరం రోడ్డులో ఉన్న డ్రైనేజి కాలువలో పడిపోయాడు. స్థానికులు గుర్తించి అతన్ని బయటికి తీయగా అప్పటికే మృతి చెందాడు. వన్టౌన్ పోలీసులు మృతుడి బంధువులకు సమాచారం అందించారు. అతని మృతిపై ఎలాంటి అనుమానం లేదని కుటుంబ సభ్యులు తెలిపారు.


