రాజుపాళెం : భర్తతో పాటు అతని కుటుంబీకులు అదనపు కట్నం కావాలని వేధింపులకు గురి చేస్తున్న సంఘటనలో నలుగురిపై కేసు నమోదైన సంఘటన సోమవారం రాజుపాళెం మండలంలో చోటు చేసుకుంది. రాజుపాళెం ఏఎస్ఐ సిద్దయ్య తెలిపిన వివరాల మేరకు... మండలంలోని అర్కటవేముల గ్రామానికి చెందిన నంద్యాల స్వప్నాదేవికి నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ టౌన్కు చెందిన గుల్లదుర్తి వెంకట కృష్ణారెడ్డితో గత ఏడాది 2025లో వివాహం జరిగింది. అప్పట్లో కట్నకానుకల కింద 21 తులాల బంగారు, ఒక కేజీ వెండి సామాన్లు, రెండు లక్షల నగదును ఇచ్చినట్లు తెలిపారు. వెంకట కృష్ణారెడ్డి హైదరాబాదులో ఫార్మా కంపెనీలో ఉద్యోగం కోసం ఇంటర్వ్యూ ఉందని అని చెప్పి వెళ్లిపోయి అదనపు కట్నం కోసం స్వప్నా దేవిని వేధింపులకు గురి చేస్తున్నారన్నారు. అదనపు కట్నం కింద మరో రెండు లక్షలు ఇవ్వాలని భర్తతో పాటు అతని మేనమామ, తమ్ముడు, అత్త వేధింపులకు గురిచేయడంతో నంద్యాల స్వప్నా దేవి ఇచ్చిన ఫిర్యాదు మేరకు భర్తతో పాటు మరో ముగ్గురిపై సోమవారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్ఐ వివరించారు.
పల్సర్ మోటార్ బైకు దగ్ధం
వేంపల్లె : పులివెందుల రోడ్డు నుండి గండికి వెళ్లే బైపాస్ రోడ్డులో ఆదివారం తెల్లవారుజామున ట్యాంకు నుంచి పెట్రోలు లీకై పల్సర్ బైకు దగ్ధమైంది. సోమవారం పోలీసులు తెలిపిన వివరాలు. వేంపల్లె మేదర వీధికి చెందిన కమల్బాషా అనే వ్యక్తి గండి బైపాస్ రోడ్డులోని ఒక ఫంక్షన్ హాలులో జరిగే వివాహానికి బైకులో వెళ్లాడు. ఆదివారం రాత్రి 2గంటల సమయంలో బైక్ యజమాని కమల్బాషా స్నేహితుడు మహమ్మద్ బైకును తీసుకుని స్పీడ్గా వెళ్లడంతో బైక్ నుంచి పెట్రోల్ లీకై మంటలు చెలరేగాయి. దీంతో మహమ్మద్ అనే వ్యక్తి భయపడి బైకును అక్కడ పడేసి వెళ్లిపోయాడు. ఈ విషయం ఎవరికీ చెప్పకపోవడంతో మంటలు ఎగసిపడి పూర్తిగా ఏపీ39సీహెచ్ 1934 నంబరు గల పల్సర్ బైకు పూర్తిగా కాలిపోయిందని సీఐ నరసింహులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


